మహాసముద్రాలు అంతరించిపోతే మానవాళి మనుగడ ప్రశ్నార్థకమైపోతుందని చెప్పింది కాజల్ అగర్వాల్. నెట్ఫ్లిక్స్లో విడుదలైన ‘సీస్ పైరసీ’ డాక్యుమెంటరీని ఇటీవలే చూసినట్లు కాజల్ అగర్వాల్ ట్విట్టర్లో పేర్కొంది. ఇందులో చర్చించిన అంశాలన్నీ తన హృదయాన్ని కదిలించాయని చెప్పింది. కాజల్ మాట్లాడుతూ ‘ఫిషింగ్ వ్యాపారం సిండికేట్ మాఫియాగా మారిపోయింది. పెస్ట్ కంట్రోల్ పేరుతో డాల్పిన్స్, వేల్స్, బ్లూఫిన్ ట్యూనా చేపల్ని అంతం చేస్తున్నారు. పారిశ్రామిక వ్యర్థాలను సముద్రజలాల్లో వదులుతుండటంతో స్వచ్ఛమైన సీఫుడ్ లభించడం లేదు. ఫిషింగ్ సంస్థల అన్యాయాల్ని ఎవరూ ప్రశ్నించడం లేదు. వారి అక్రమాలకు అడ్డుకట్ట వేసే చట్టాలు లేకపోవడం విచారకరం. సముద్రజీవుల్ని తినడం ఆపితే కొంతవరకు ఈ నష్టాల్ని నివారించవచ్చు. నేను చాలా కాలంగా వృక్షఆధారిత ఆహారానికి ప్రాధాన్యతనిస్తున్నా. నాకు ఎలాంటి పోషక సమస్యలు ఎదురవ్వలేదు. సముద్రాల్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉంది’ అని తెలిపింది.