బాలీవుడ్ యువ హీరో సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య ఉదంతం సినీ పరిశ్రమతో పాటు యావత్ దేశాన్ని షాక్కు గురిచేసింది. ఉజ్వల భవిష్యత్తు ఉన్న నటుడు అర్థాంతరంగా తనువు చాలించడం ప్రతి ఒక్కరిని కలచివేసింది. 2020 జూన్లో సుశాంత్సింగ్ రాజ్పుత్ ముంబయిలోని తన అపార్ట్మెంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుశాంత్ మరణం వెనక కుట్ర ఉందని, హత్యను ఆత్మహత్యగా చూపించారని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అయితే గత మూడేళ్లుగా ఈ కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు.
తాజాగా ఈ విషయం గురించి మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కీలక వ్యాఖ్యలు చేశారు. విచారణలో కొన్ని ముఖ్యమైన సాక్ష్యాలను సేకరించామని చెప్పారు. కేసు విచారణ సందర్భంగా కొందరు బలమైన సాక్ష్యాలతో పోలీసులను సంప్రదించారని ఆయన పేర్కొన్నారు. ‘ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్నది. కొన్ని బలమైన సాక్ష్యాలు లభించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నది. కేసు దర్యాప్తులో ఉన్నందున ఎక్కువ వివరాలను వెల్లడించలేను’ అని దేవేంద్ర ఫడణవీస్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.