కోలీవుడ్ స్టార్ సూర్య కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్నది ఆయన 42వ సినిమా. ఈ సినిమాను పీరియాడిక్ యాక్షన్ డ్రామా కథతో పది భాషల్లో తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సిరుతై శివ. త్రీడీ ఫార్మేట్లో రూపొందుతున్న సూర్య 42లో నాయికగా నటిస్తున్నది బాలీవుడ్ తార దిశా పటానీ. ఇప్పటికే ఒక షెడ్యూల్ చిత్రీకరణ గోవాలో పూర్తి చేశారు. తాజాగా తమిళనాడులో రెండో షెడ్యూల్ ప్రారంభమైంది. తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా చిత్రీకరణ జరపనున్నారు.
ఈ కొత్త షెడ్యూల్లో జాయిన్ అయ్యింది దిశా పటానీ. ‘సూర్య 42, వీ ఆర్ రెడీ..’అనే క్యాప్షన్తో తను సినిమా షూటింగ్లో చేరుతున్నట్లు సోషల్ మీడియా ద్వారా ఈ నాయిక వెల్లడించింది. ఈ సినిమాలో సూర్య ఐదు విభిన్న క్యారెక్టర్స్లో కనిపిస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఏప్రిల్ కల్లా షూటింగ్ పూర్తి చేయబోతున్నారు. ఈ చిత్రంలో నటించడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసింది దిశా పటానీ. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.