Author : Maduri Mattaiah
Suriya Interview | గ్రామాల నుంచి సీటీల వరకు… ప్రపంచంలోని మనుషులందరి మైండ్సెట్ను కరోనా పాండమిక్ మార్చేసిందని అంటున్నారు తమిళ కథానాయకుడు సూర్య. మనుషుల జీవితాలతో పాటు సినిమా పరిశ్రమలో కూడా కరోనా పెనుమార్పులు తీసుకొచ్చిందని ఆయన చెబుతున్నారు. సూర్య నటించిన తాజా చిత్రం ఈటీ ఎవరికి తలవంచడు. ఈ నెల 10న తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కాబోతుంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న పలు సమస్యలను చర్చించినట్లుగా సూర్య ఈ సందర్భంగా తెలియజేశారు.ఈటీ చిత్ర ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్కు విచ్చేసిన సూర్యతో నమస్తే తెలంగాణ జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇది.
కరోనా పరిస్థితులు మీలో తీసుకొచ్చిన మార్పులు ఏమైనా ఉన్నాయా?
దాదాపు రెండు సంవత్సరాలుగా అందరూ ఇంట్లోనే ఉంటున్నారు. పాండమిక్ తర్వాత ప్రతి వారి ఆలోచనలను మార్చేసింది. ఏ సమయంలో ఏ పని చేయాలో, ఏ పనికి ఎంత సమయం కేటాయించాలి. ఫ్యామిలీతో ఎలా గడపాలనేది తెలిపింది. నా బంధువులు కూడా తమకు నచ్చిన ప్రాంతాలకు వెళ్లి అక్కడ నుంచి జూమ్లో మాట్లాడుకునేవారు. ఇక యూత్ లైఫ్ను మార్చేసింది. పెండ్లిళ్లు కూడా విదేశాల్లో కాకుండా ఇక్కడే చేసుకొనేలా పరిస్థితులు కల్పించింది.అదేవిధంగా నా మిత్రుడు మాధవన్ కూడా విదేశాలకు వెళ్లి అక్కడ తన కొడుక్కి స్విమ్మింగ్ నేర్పించాడు. కుటుంబానికి చాలా సమయం కేటాయించాడు. చాలామంది నా బంధువులు, స్నేహితులు కూడా స్వచ్ఛమైన వాతావరణం కోసం రిమోట్ ఏరియాకు వెళ్లి హాయిగా ఆరోగ్యం గురించి కేర్ తీసుకున్నాడు. నా కుటుంబ సభ్యుల్లో కొందరు కొడై కెనాల్ వెళితే, మరికొందరు గోవా వెళ్లారు.పాండమిక్ బిజినెస్ పరంగా పర్యాటక రంగాన్ని, ఆసుపత్రులను పూర్తిగా మార్చేసింది. డెస్టినేషన్ వెడ్డింగ్స్ అవుట్ ఆఫ్ ఇండియాలో జరగలేదు. ఏడాదిన్నర కాలం ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఒక సైకిల్ షాప్ ఓనర్ రెండున్నర ఏళ్ళు ఒక సైకిల్ కూడా అమ్మలేదట. ఆ తర్వాత మూడు నెలల్లో ఆఫర్లు వస్తే అమ్మడానికి సరుకులేదు. ఇలా వైవిధ్యమైన సంఘటనలు జరిగాయి.
సినిమా రంగంలో వచ్చిన మార్పులు ఏమిటి?
కరోనా మహమ్మారి కారణంగా సినిమా రంగంలోనూ పెను మార్పులు వచ్చాయి. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ సినిమాలు ఓటీటీలో విడుదల అయ్యి ఆదరణ పొందాయి. ఈ సినిమా చూసి కలకత్తా నుంచి కూడా ఫోన్ చేసి మెచ్చుకున్నారు. డిజిటల్ బిజినెస్ నిర్మాతలకు బూస్ట్ ఇచ్చింది. కొత్త దర్శకులు, రచయితలు, కొత్త కథలు వెలుగులోకి వచ్చాయి. పాండమిక్ తర్వాత పుష్ప, భీమ్లా నాయక్ కూడా థియేటర్లో విడుదలై మంచి కలెక్షన్లు రాబట్టాయి. అలా సినిమాలు పెద్ద వ్యాపారం జరిగేలా పరిస్థితులు అనుకూలించాయి.
ఓటీటీ వల్ల సినిమా రంగంలో చోటు చేసుకున్న పరిణామాలేమిటి?
డిజిటల్లో అల్లు అరవింద్కు చెందిన ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా! ద్వారా చాలా మంది వెలుగులోకి వచ్చేలా చేసింది.రాజమౌళి సినిమాలు అన్నిచోట్ల బజ్ క్రియేట్ చేస్తున్నాయి. తమిళ హీరోలు తెలుగులోకి వచ్చేలా చేసింది. మలయాళ పరిశ్రమలో వస్తున్న కొత్త కంటెంట్ను అందరూ చూసి ఎంజాయ్ చేస్తున్నారు. దాంతో పరిశ్రమ మొత్తం మారిపోయింది. ఢిల్లీ నుంచి ముంబై వరకు పలు పొడ్రక్షన్ కంపెనీలు విస్తృతం అయ్యాయి. యాక్షన్ సీక్వెన్స్లో కొత్త ప్రక్రియ వచ్చేసింది. ఫాంటసీ సినిమాలే కాదు కంటెంట్ సినిమాలకు యూత్ పెద్ద పీట వేస్తున్నారు. విప్లవాత్మకమైన ఈ మార్పులు మరింత పురోభివృద్ధికి దోహదం చేస్తున్నాయి. మంచి సినిమాలు వస్తే శుక్ర, శని, ఆదివారం యూత్ బాగా చూస్తున్నారు. దీంతో నిర్మాతలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఒక్కొక్కరు ఆర్టిస్టుగా ఏం చేయాలనేది గ్రహించారు. పైరసీ అరికట్టి ఓటీటీ కొత్త ఆడియన్స్ను తీసుకువచ్చింది. తమిళనాడులో 8కోట్ల జనాభా ఉంటే 80 లక్షల మంది ఓటీటీలో సినిమాలు చూస్తున్నారు. అఖండ, పుష్ప, భీమ్లానాయక్ చిత్రాలు పాండమిక్ తర్వాత బూస్ట్ ఇచ్చాయి. రేపు రాబోయే ఈటీ. కూడా అంత బూస్ట్ ఇస్తుందని నమ్ముతున్నాను.
ఈటీ కథాంశం ఏమిటి?
సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అంశాలే.. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడుతోపాటు దేశంలో ఎక్కడివారైనా కనెక్ట్ అవుతారు. ప్రతి గ్రామంలోనూ జరుగుతున్న సంఘటనలే. వాటిని దర్శకుడు ఎలా డీల్ చేశాడనేది ఈటీ సినిమా.
ఈటీ కథ ద్వారా ఎలాంటి అంశాన్ని ప్రేక్షకులకు చెప్పబోతున్నారు?
మన ఇంటికి బంధువులు వస్తే అమ్మాయితో మంచి నీళ్లు ఇప్పిస్తారు. అబ్బాయి ఇవ్వడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇందులో చర్చించాం. ఎక్కడా అసందర్భ సన్నివేశాలు ఉండవు. అదే విధంగా భార్యా భర్తల మధ్య చిన్న విషయాలు వస్తే సర్దుకుపోవాలని భార్యకు చెబుతారు. ఇలాంటివి దర్శకుడు బాగా చూపించాడు.
జైభీమ్ ఆస్కార్ నామినేషన్కు ఎంపిక కాకపోవడంతో నిరాశ చెందారా?
జై భీమ్ అనేది ఆస్కార్కు వెళ్లింది. అవార్డుకు వెళ్ళిన ఏ సినిమా అయినా యూఎస్లోని మూడు రాష్ట్రాలలో ఆడాలి. కానీ కరోనా వల్ల ఓటీటీ కూడా తీసుకుంటున్నారనే లాజిక్తో మేం వెళ్లాం. చాలామంది మెచ్చుకున్నారు. దాదాపు 3వేల సినిమాలు ప్రపంచవ్యాప్తంగా వస్తాయి. వాటిని జ్యూరీ సభ్యులు చూడాలి.
తొలిసారిగా ఈటీ చిత్రానికి తెలుగులో మీరే డబ్బింగ్ చెప్పారు? ఎలా అనిపించింది?
నేను తెలుగు డబ్బింగ్ చెప్పాను. అది యాసలో ఉంటుంది. తమిళంలో కూడా ఇలా ఉంటే వెరైటీగా ఉంటుందని దర్శకుడు చెప్పారు. చిన్న చిన్న డైలాగులు చిన్న చిన్న మార్పులు చేశాం.
మీ తదుపరి చిత్రాలు ఎలా ఉండబోతున్నాయి?
దర్శకుడు బాలతో సినిమా చేస్తున్నా. వెట్రిమారన్తో `వాడి వాసల్` సినిమా చేయాలి. అందులో ప్రతి షాట్కు కనీసం 500 మంది ఆర్టిస్టులు ఉడాలి. అందుకే కరోనా టైంలో అది సాధ్యపడలేదు. జూన్లో ప్రారంభించాలని అనుకుంటున్నాం అని ముగించారు.