ఇన్నాళ్లు బుల్లితెరపై సందడి చేసిన యాంకర్ సుమ చాలా గ్యాప్ తర్వాత తిరిగి వెండితెర ఎంట్రీ ఇవ్వబోతుంది. జయమ్మ పంచాయితీ అనే చిత్రంలో సుమ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, వెన్నెల క్రియేషన్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని బలగ ప్రకాష్ నిర్మిస్తున్నారు. ఈ మూవీతో విజయ్ కుమార్ కలివారపు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా.. అనుష్ కుమార్ కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు.
కొద్ది సేపటి క్రితం చిత్ర టీజర్ విడుదలైంది. ఇందులో సుమ పంచ్ డైలాగులు అదిరిపోయాయి. రెండ్రోజుల్లో తేల్చకపోతే పంచాయితీ ఉండదు పెద్దలు ఉండరు! అంటూ జయమ్మ గట్టిగానే వార్నింగ్ ఇస్తోంది. నీ దగ్గర డబ్బు ఎలా వసూలు చేయాలో తెలుసు! అంటూ ఒక పెద్దమనిషిని దబాయిస్తోంది. ఊళ్లో ఇళ్ల స్కీమ్ ల గురించి ఆవేదన వ్యక్తం చేస్తోంది. అంతేనా.. నీ మొగుడు మంచాన పడ్డాడు! అంటే.. నా మొగుడు నా మంచాన పడ్డాడు! అంటూ గట్టిగానే సమాధానమిచ్చింది.
‘జయమ్మకి ఐదారు లక్షలు వస్తాయని ఊరంతా అనుకుంటా ఉండారు’ అని ఓకావిడ సుమతో అంటే.. ‘అనుకోవడమే మిగిలింది. ఆకులు నాకినోడు పోయి, మూతులు నాకినోడు వచ్చినట్లుంది’ అని సుమ కౌంటర్ డైలాగ్ అదిరిపోయింది, ఒకవైపు ఎంటర్టైనింగ్గా ఉంటూనే సుమ ఊరందరితో తన మొగుడు విషయంలో పెద్ద గొడవే పడుతుందని అర్థమవుతుంది. అసలు ఈ జయమ్మ పంచాయితీ గొడవేంటనేది తెలుసుకోవాలంటే కొద్ది రోజులు ఆగక తప్పదు.