ఒకప్పుడు తెలుగు సినిమా లెక్కలు వేరుగా ఉండేవి. అప్పట్లో ఒక సినిమా వంద రోజులు ఆడిందంటే ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అని చెప్పేవారు . కాని ఇప్పుడు అలా కాదు, చిత్రం పది రోజులు ఆడడం చాలా కష్టంగా మారింది. ఇప్పుడంతా కలెక్షన్స్ ప్రకారం హిట్, ఫట్ అని తేల్చేస్తున్నారు. అయితే ఒకప్పుడు వెయ్యికి పైగా రోజులు సినిమాలు ఆడిన పరిస్థితి ఉంది. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన పోకిరి మూవీ థియేటర్ లలో వెయ్యి రోజుల వరకు నిలబడి ఒక రికార్డు సృష్టించింది.
బాలకృష్ణ లెజెండ్ సినిమా కూడా 1005 రోజులు కూడా ఆడి కొత్త రికార్డును సాధించింది. మగధీర చిత్రం కూడా వెయ్యికి పైగా రోజులు థియేటర్లో ప్రదర్శితం అయింది. ఇక మనసంతా నువ్వే సినిమా కూడా 205 రోజులు, నువ్వే కావాలి 200 రోజులు ఇలా ఎన్నో సినిమాలు థియేటర్లలో ఆడి ప్రేక్షకులకు కనువిందు అందించాయి. అయితే అప్పట్లో ఎన్నో రోజులు ఆడే సినిమాలు ఇప్పుడు వారం కూడా థియేటర్లో ఆడకపోవడానికి కారణం ఏంటి?
అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారాయి. అప్పుడు సినిమా రిలీజ్ అయిన ఏడాది తర్వాత బుల్లితెరపైకి వచ్చేది. కాని ఇప్పుడు బుల్లితెర కాకుండా కొత్తగా ఓటీటీ ఒకటి వచ్చింది. సినిమా విడుదలైన కొద్ది రోజులకే ఓటీటీ, బుల్లితెరపై ప్రత్యక్షం అవుతుంది. మరోవైపు సినిమా రిలీజ్ అయిన రోజే పైరసీ రూపంలో చిత్రం బయటకు వచ్చేస్తుంది. ఈ క్రమంలోనే థియేటర్కి జనాల తాకిడి పెద్దగా ఉండడం లేదు. అందుకే ఆ సినిమా ప్లేస్ లో మరో సినిమా వెంటనే వచ్చేస్తుంది. అదీకాక వారం గ్యాప్లో నాలుగైదు సినిమాలు ఒకేసారి రావడం కూడా కారణం అని చెప్పొచ్చు.