ప్రముఖ నిర్మాత దిల్ రాజు వెబ్ కంటెంట్ పై దృష్టి పెట్టారు. దర్శకుడు హరీశ్ శంకర్ తో కలిసి ఏటీఎమ్ రాబరీ బిగిన్స్ సూన్ అనే వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నారు. హరీశ్ శంకర్ ఈ వెబ్ సిరీస్ కు కథను అందిస్తున్నారు. చంద్ర మోహన్ దర్శకుడు. జీ5 సంస్థతో కలిసి దిల్ రాజు నిర్మిస్తున్న ఏటీఎమ్ వెబ్ సిరీస్ ను గురువారం హైదరాబాద్ లో అనౌన్స్ చేశారు. దర్శకుడు హరీశ్ శంకర్, దిల్ రాజు కలిసి అసోసియేట్ అవుతున్న ప్రాజెక్ట్ కాబట్టి ఏటీఎమ్ పై అంచనాలు ఏర్పడుతున్నాయి.
ఇటీవల తన సోదరుడి కుమారుడు ఆశిష్ ను రౌడీ బాయ్స్ ద్వారా తెరకు పరిచయం చేసిన దిల్ రాజు, ఆ సినిమా ప్రచారం సమయంలో మారుతున్న ట్రెండ్ వైపు తాను కూడా అడుగులు వేయాల్సి ఉందని చెప్పారు. అలా ఈ వెబ్ సిరీస్ గురించి అప్పుడే హింట్ ఇచ్చారు దిల్ రాజు. కాలంతో పాటు ప్రేక్షకుల అభిరుచి మారుతోందని, ఆ తరహా కంటెంట్ ఇచ్చినప్పుడే ఇండస్ట్రీలో అప్ డేట్ అయినట్లని దిల్ రాజు చెప్పారు. అన్నట్లుగానే ఇప్పుడు వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేశారు. వెండితెరపై లక్కీ హ్యాండ్ గా పిలుచుకునే ఈ స్టార్ ప్రొడ్యూసర్ వెబ్ కంటెంట్ లో సక్సెస్ పై పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలుస్తోంది.