‘ఐదు నిమిషాల్లో ఇన్స్టంట్ ఫుడ్లా సినిమాలు తెరకెక్కించే విధానం మారాలి’ అన్నారు స్టార్ హీరో చిరంజీవి. చాలా మంది దర్శకులకు సినిమాల రూపకల్పనలో ముందస్తు ప్రణాళిక కొరవడిందని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సెట్లో డైలాగ్స్ రాసే పద్ధతి మార్చుకోవాలన్నారు. ఇటీవల ఆమిర్ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి చేసిన వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశం అయ్యాయి. ఆయన్ను ఇబ్బంది పెట్టిన దర్శకులు ఎవరనే చర్చ జరుగుతున్నది.
చిరంజీవి మాట్లాడుతూ…‘సెట్లో వేడివేడిగా ఆహారం వడ్డిస్తుంటారు. కానీ వేడివేడిగా సంభాషణలు వడ్డించడం మాత్రం నాకు రుచించడం లేదు. దర్శకుడు ఎక్కడ అని అడిగితే డైలాగ్స్ రాస్తున్నారు అని చెబుతుంటారు. అతనేం రాస్తున్నాడో, అవి ఎలా చెప్పాలో అని భయపడే పరిస్థితి వచ్చింది. దాంతో మొక్కుబడిగా నటించి బయటపడుతున్నాం. చాలా మంది దర్శకుల్లో ఉన్న ఈ ఇన్స్టంట్ పద్ధతి మారాలి.
పూర్తి స్క్రిప్ట్ మీద హీరోతో పాటు నటీనటులకు అవగాహన కల్పించాలి. ఇందుకు వర్క్ షాప్స్ నిర్వహించాలి. ఒక్క హీరోకే కథ తెలిస్తే ఎలా? మిగతా నటీనటులు సెట్కొచ్చి కథకు ఎలా న్యాయం చేయగలరు. వాళ్లకూ కథ తెలియాలి. దర్శకులు కథను పక్కనపెట్టకుండా దాని మీద పూర్తిగా కసరత్తు చేయాలి.’ అని అన్నారు.