Vishweshwar Rao | తెలుగు చిత్రసీమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కాస్ట్యూమ్ డిజైనర్ ‘దాసి’ సుదర్శన్, మాటల రచయిత శ్రీరామకృష్ణ మరణ వార్త నుంచి కోలుకోకముందే తాజాగా హాస్య నటుడు విశ్వేశ్వరరావు (62) మంగళవారం చెన్నైలో అనారోగ్యంతో కన్నుమూశారు. విశ్వేశ్వర రావు స్వస్థలం కాకినాడ. బాల నటుడిగా కెరీర్ను మొదలుపెట్టారు. పొట్టిప్లీడరు చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. బాల భారతం, నిండు హృదయాలు, భక్త పోతన, బాలమిత్రుల కథ, ఓ సీత కథ, మా నాన్న నిర్ధోషి, పట్టిందల్లా బంగారం, అందాల రాముడు, ఇంటిగౌరవం వంటి చిత్రాలు బాల నటుడిగా ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ప్రముఖ హాస్య నటుడు రాజబాబు చిన్ననాటి పాత్రల్లో ఎక్కువగా నటించేవారు. బాలనటుడిగా 150కిపైగా చిత్రాల్లో నటించారు. అనంతరం కాలంలో ఆయన సహాయ పాత్రల్లో మెప్పించారు. ముఠామేస్త్రీ, ప్రెసిడెంట్ గారి పెళ్లాం, ఆమె కథ, ఆయనకు ఇద్దరు, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, మెకానిక్ అల్లుడు, శివాజీ, అవును వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు వంటి చిత్రాల్లో హాస్య నటుడిగా తనదైన ప్రతిభతో మెప్పించారు. సినిమాలతో పాటు 150కి పైగా సీరియల్స్లోనూ నటించారు విశ్వేశ్వరరావు. చెన్నై సమీపంలోని ఆయన స్వగ్రామం సిరుశేరిలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.