‘హీరోగా రొటీన్ సినిమాలు చేయడం నాకు నచ్చదు. కెరీర్ ఆరంభం నుంచి విలక్షణ కథల్ని ఎంచుకుంటున్నాను. ఆ పంథాలోనే నేను చేసిన మరో విభిన్నమైన చిత్రమిది’ అని అన్నారు సుధీర్బాబు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’. కరుణకుమార్ దర్శకుడు. విజయ్ చిల్లా, శశిదేవిరెడ్డి నిర్మాతలు. ఆనంది కథానాయిక. ఈ నెల 27న ఈ చిత్రం విడుదలకానుంది. శనివారం హైదరాబాద్లో ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఈ చిత్ర తొలి టికెట్ను దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో కార్తికేయ కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా సుధీర్బాబు మాట్లాడుతూ ‘గోదావరి ప్రాంతానికి చెందిన సూరిబాబు, శ్రీదేవి అనే జంట కథ ఇది. కథ, పాత్రలతో ప్రతి ఒక్కరూ సహానుభూతి చెందుతారు. వారి ప్రేమకథ తాలూకు జ్ఞాపకాలు చాలా రోజులు వెంటాడుతాయి’ అన్నారు. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని తాము చేసిన సినిమా ఇదని నిర్మాతలు పేర్కొన్నారు. ‘థియేటర్స్లో కుటుంబమంతా కలిసి చూసే అందమైన ప్రేమకథ చిత్రమిది. మణిశర్మ సంగీతం, శ్యాందత్ ఛాయాగ్రహణం ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని దర్శకుడు కరుణకుమార్ చెప్పారు.