ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కారణజన్ముడు.. అమరగాయకుడని, అలాంటి గొప్ప వ్యక్తి గురించి ఎంత చెప్పుకున్నా తనివి తీరదని అన్నారు సీనియర్ దర్శకుడు కె.విశ్వనాథ్. దివంగత గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం 75వ జయంతి సందర్భంగా శుక్రవారం తెలుగు చిత్రసీమ ఆయనకు ఘన నివాళులు అర్పించింది. ‘ఎస్పీ బాలుకు స్వరనీరాజనం’ పేరుతో జూమ్ వేదికగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవితో పాటు పలువురు అగ్రహీరోలు, దర్శకులు పాల్గొని బాలసుబ్రహ్మణ్యంతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ ‘నా సినీజీవితం విజయవంతం కావడానికి సగభాగం బాలు పాత్ర ఉంది. సంగీతం ఉన్నంతవరకు చిరంజీవుడిగా బాలసుబ్రహ్మణ్యం అందరి మనసుల్లో నిలిచిఉంటారు’ అన్నారు. 16 భాషల్లో నలభై వేలకుపైగా పాటలు పాడి ప్రపంచరికార్డు సృష్టించిన బాలు తెలుగువాడు కావడం గర్వకారణమని సీనియర్ హీరో కృష్ణ పేర్కొన్నారు. పాటకు, పల్లవికి బాలు గాత్రమే ప్రాణంగా నిలిచిందని కె.రాఘవేంద్రరావు చెప్పారు. స్వరనీరాజనంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.