నవీన్ నేని, ప్రణీత పట్నాయక్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రిచిగాడి పెళ్లి’. కేఎస్ హేమరాజ్ దర్శకుడు. ఈ చిత్రంలో ప్రముఖ గాయకుడు కైలాష్ కేర్ ఆలపించిన ‘ఏమిటిది మతి లేదా ప్రాణమా’ అనే పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు మంచి స్పందన వస్తోందని, తమ పాట సంగీత దర్శకుడు తమన్కు నచ్చడం మరింత సంతోషం కలిగిందని చెబుతోంది చిత్రబృందం. ఈ పాటకు సాహిత్యం అందించిన అనంత శ్రీరామ్ మాట్లాడుతూ ‘అందరికి అర్థమయ్యే మధురమైన రీతిలో ఈ పాట బాణీ ఉంటుంది. మనం చిన్నప్పుడు బల్లల మీద ఆడుకున్న చిన్న చిన్న ఆటలను ఆధారంగా చేసుకుని తీసిన సినిమా ఇది. తక్కువ బడ్జెట్లో ఎంతో సృజనాత్మకంగా దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. తప్పకుండా ఈ చిత్ర కథాంశం అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.