Kalaimamani | స్టార్ నటి సాయి పల్లవి మరో అరుదైన ఘనతను అందుకుంది. కళారంగంలో విశేష కృషి చేసిన వారికి తమిళనాడు ప్రభుత్వం అందించే ‘కలైమామణి’ అవార్డును సాయి పల్లవి అందుకోబోతుంది. తమిళనాడులోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన ఈ అవార్డును 2021 సంవత్సరానికి గానూ సాయి పల్లవి అందుకోబోతున్నారు. ఈ అవార్డులను తమిళనాడు ప్రభుత్వం 2021, 2022, 2023 సంవత్సరాలకు కలిపి ప్రకటించింది. ఇందులో భాగంగా నటి సాయి పల్లవికి 2021 సంవత్సరానికి, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కు 2023 సంవత్సరానికి ఈ పురస్కారం లభించింది. వీరే కాకుండా, దర్శకుడు-నటుడు ఎస్. జె. సూర్య, దర్శకుడు లింగుసామి, నటుడు విక్రమ్ ప్రభు, మరియు మణికందన్ వంటి ప్రముఖులు కూడా ఈ అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్యం, సంగీతం, నాటకం, సినిమా వంటి వివిధ కళా రంగాల్లో కృషి చేసిన వారిని గుర్తించి తమిళనాడు ప్రభుత్వం ఈ పురస్కారాన్ని అందిస్తుంది. కళైమామణి అవార్డు గ్రహీతలకు మూడు సవర్ల బంగారు పతకం, ప్రశంసాపత్రం అందజేస్తారు. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.