‘14ఏండ్ల తర్వాత సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన సినిమా ‘సింగ్ గీతం’. ఇది ఆయన 40ఏండ్ల కల. ఇలాంటి సినిమాని ఇప్పటివరకూ ప్రపంచం ఎరుగదు. ఇది సింగీతం శైలి కొత్త ప్రయోగం. పదిఏండ్ల వయసులో ‘ఆదిత్య 369’ సినిమా చూసి స్ఫూర్తి పొందాను. ఏడాది పాటు సింగీతంగారితో ప్రయాణించి, ఇలాంటి విభిన్నమైన సినిమాలు ఎలా చేయాలో నేర్చుకున్నాను. రేపటి నుంచి ఈ సినిమా లైఫ్ మొదలు కానున్నది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’ అని నిర్మాత నాగ్ అశ్విన్ నమ్మకం వ్యక్తంచేశారు. ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్లో ఆయన నిర్మించిన ఫాంటసీ కామెడీ మ్యూజికల్ ఫిల్మ్ ‘సింగ్ గీతం’. ఆయాన్, అహల్య బమ్రూ, శాలిని కొండెపుడి ప్రధాన పాత్రధారులు. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రం ఈ శుక్రవారం విడుదల కానున్నది. ఈ సందర్భంగా గురువారం హైదరాబాద్లో విలేకరులతో నాగ్ అశ్విన్ మాట్లాడారు.
‘సింగీతంగారి ఆలోచనలు కొత్తగా ఉంటాయి. ఆయన నాకంటే అడ్వాన్స్గా ఉంటారు. ‘ఆదిత్య 369’ టైమ్లోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడారాయన. ఆయన కథలు ఏజ్లెస్గా ఉంటాయి. ఆయన విజన్ని మేమంతా కలిసి ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేశాం. మాటలే పాటలుగా మారితే ఎలా ఉంటుందనే ఆలోచనే ఆసక్తికరమైనది. ఇందులో పాటలు వస్తున్నాయనే విషయం తెలియకుండానే కథతో ప్రయాణిస్తాడు ప్రేక్షకుడు’ అని తెలిపారు నాగ్అశ్విన్. దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ జీనియస్ అని, తెలుగు భాషపై ఆయనకు అద్భుతమైన పట్టు ఉందని, పాటలను రాయడమే కాక, మాటలను పాటలుగా ఆయన మార్చగలరని, ఆయన ముందుగానే మ్యూజిక్ ఇచ్చేస్తే దానికి తగ్గట్టు షూట్ చేశామని, రేపు ఆ మ్యాజిక్ని తెరపై చూస్తారని, ఇప్పుడు నిర్మాతగా నాకు సామర్థ్యం ఉంది కాబట్టే సింగీతంగారికి అవసరమైన ప్రతీది అందించడానికి ప్రయత్నించానని నాగ్అశ్విన్ చెప్పారు.