Kalki 2 | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘కల్కి 2898 AD’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విజువల్ గ్రాండియర్, పురాణాల ఆధారంగా భవిష్యత్ నేపథ్యంలో సాగిన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్గా ‘కల్కి 2’ను మరింత భారీ స్థాయిలో తీసుకురావడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. కథను మరింత లోతుగా, భావోద్వేగపూర్వకంగా తీర్చిదిద్దేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. మొదటి భాగంలో చూపించిన ప్రపంచాన్ని విస్తరించి, కొత్త పాత్రలు, ఆసక్తికరమైన మలుపులతో సీక్వెల్ను రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారు.
తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సీక్వెల్లో ఒక పవర్ఫుల్ స్పెషల్ పాత్ర ఉండబోతుందని, అది క్లైమాక్స్లో కీలకంగా మారుతుందని టాక్. ఆ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో శింబును సంప్రదించినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన ఈ సినిమాలో నటిస్తే తమిళ మార్కెట్లో సినిమాకు మరింత బలం చేకూరే అవకాశముందని అంటున్నారు. మొదటి భాగం చివర్లో ప్రభాస్ పాత్రను కర్ణుడిగా చూపిస్తూ మేకర్స్ ఇచ్చిన ట్విస్ట్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. దీంతో సీక్వెల్పై ఆసక్తి మరింత పెరిగింది. ఈసారి కథ ప్రధానంగా కర్ణుడి గతం, అతని గాథ, తిరిగి రావడం వంటి అంశాలపై నడుస్తుందని సమాచారం. ఈ నేపథ్యంలో ‘కర్ణ 3102 BC’ అనే టైటిల్ను కూడా పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికే షూటింగ్లో పాల్గొంటున్నారు. ఆయన మళ్లీ అశ్వథ్థామ పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ జరుగుతుండగా, బిజీ షెడ్యూల్ కారణంగా అభిమానులను కలవలేకపోయానని ఆయన తెలిపారు. ప్రభాస్ కూడా త్వరలో షూటింగ్లో చేరనున్నారని సమాచారం.ఇక మరో ముఖ్య ఆకర్షణగా కమల్ హాసన్ కూడా ఈ సీక్వెల్లో కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ చాలా ఏళ్ల తర్వాత మళ్లీ కలిసి నటిస్తుండడం విశేషం. గతంలో వీరు ‘గిరాఫ్తార్’ సినిమాలో కలిసి నటించారు.రీ తారాగణం.. ఇక ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, జేడీ చక్రవర్తి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. దీంతో ‘కల్కి 2’కు భారీ తారాగణం సిద్ధమవుతోంది.