ప్రభాస్ కథానాయకుడిగా ఇటీవల విడుదలైన పాన్ ఇండియా చిత్రం ‘సలార్’లో నెగెటివ్ షేడ్స్ కలిగిన రాధా రమ పాత్రలో ప్రేక్షకులను మెప్పిస్తున్నది శ్రియా రెడ్డి. ప్రశాంత్నీల్ దర్శకత్వంలో హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లతో దూసుకుపోతున్నది. ఈ సందర్భంగా మంగళవారం శ్రియా రెడ్డి పాత్రికేయులతో మాట్లాడుతూ ‘తొలుత దర్శకుడు ప్రశాంత్నీల్ ఈ కథ చెప్పినప్పుడు వద్దన్నాను. ఆ సమయంలో నేను సినిమాలు చేయొద్దనే నిర్ణయం తీసుకొని ఉన్నా. అయితే ఓసారి స్క్రిప్ట్ విని నిర్ణయం తీసుకోమన్నారు.
హీరో ఎవరైనా పర్లేదు, నా క్యారెక్టర్కు మాత్రం చాలా ప్రాధాన్యత ఉండాలని ప్రశాంత్నీల్తో చెప్పాను. రాధారమ పాత్రను డిజైన్ చేస్తున్నప్పుడే లుక్పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. విలనిజం ఉంటూనే అందంగా కనిపించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. విలనీ లుక్స్ ఎక్కువగా కనిపించొద్దని ఆభరణాలు, టాటూస్ వంటివి వొద్దనుకున్నాం.
‘సలార్’ తొలిభాగంలో కథను ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశాం. రెండో భాగం మరోస్థాయిలో ఉంటుంది. సెకండ్పార్ట్లో నా క్యారెక్టర్ నిడివి ఎక్కువగా ఉంటుంది. ప్రభాస్ చాలా స్వీట్ పర్సన్. ఆయనతో పనిచేయడం గ్రేట్ ఎక్స్పీరియన్స్. పవన్కల్యాణ్తో కలిసి నటిస్తున్న ‘ఓజీ’ సినిమాలో నా పాత్ర చాలా స్పెషల్గా ఉంటుంది. అయితె నెగెటివ్ రోల్ మాత్రం చేయడం లేదు. యాక్షన్తో పాటు బలమైన ఉద్వేగాలు ఉన్న కథ ‘ఓజీ’. ఈ సినిమా తర్వాత నటిగా నేను రిటైర్ అయిపోతానేమో (నవ్వుతూ). నా పాత్రను అంత గొప్పగా డిజైన్ చేశారు’ అని చెప్పింది.