Shreya Ghoshal | స్వర మాధురి, గాన కోకిల శ్రేయాఘోషల్ పరిచయం అక్కర్లేని పేరు. ‘నువ్వేం మాయ చేశావో’ అంటూ సంగీత ప్రియులను మాయ చేసింది. ‘సిగ్గేస్తుంది’ అంటూ ‘సీతయ్య’ సినిమాలో సిమ్రాన్తో సిగ్గులొలికించినా, ‘కోపమా నాపైనా’ అంటూ ప్రభాస్తో త్రిష అల్లరి చేసినా, ‘నికోసం నికోసం’ అంటూ శ్రీయా, నాగార్జునకు ప్రేమను వ్యక్తపరిచినా. ‘వచ్చే వచ్చే నల్లమబ్బుల్లారా’ అంటూ కమలిని ముఖర్జీ నాట్యం చేసినా, ‘పిల్లగాలి అల్లరి’ అంటూ మహేష్బాబుతో త్రిష అల్లరి చేష్టలతో అలరించినా, ‘ప్రేమించే ప్రేమవా’ అంటూ సూర్య చూపించే ప్రేమకు భూమిక ఉప్పొంగినా, ‘అనుకోలేదేనాడు ఈ లోకం’ అంటూ షామిలీ లోకానికి తన ఆనందాన్ని చెప్పినా, ‘నీ నవ్వే కొత్తగ ఉంది’ అంటూ నాగార్జునను పొగడ్తలతో ముంచినా, ‘బ్లాక్ బాస్టరు బ్లాక్ బాస్టరే’ అంటూ బన్నీ స్టెప్పులేసినా , ‘దిగు దిగు నాగ’ అంటూ పెప్పి సాంగ్ వచ్చినా ఇలా ప్రతి ఫీలింగ్ను తన గొంతుతో అమ్మ గొప్పతనాన్ని, నాన్న మంచితనాన్ని, తోబుట్టువు భాదని, భర్త కేరింగ్ను, పిల్లల మమకారాన్ని, ఇలా ప్రతి పాత్ర ఫీలింగ్ను పాటలో తనగొంతుతో ప్రాణం పోసింది. శనివారం ఈమె పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో సంగీత ప్రేమికులు, గాయకులు విషెస్ను తెలియజేస్తున్నారు.
శ్రేయాఘోషల్ 1984 మర్చి 12 పశ్చిమ్ బెంగాల్లోని దుర్గాపూర్లో జన్మించింది. శ్రేయాఘోషల్ తల్లి సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యూవేట్ చేసింది. నాలుగేళ్ల వయసు నుంచే శ్రేయాఘోషల్ తన తల్లి వద్దనే హర్మోనియంను నేర్చుకుంది. సంగీతంపైన తనకున్న ఆసక్తిని గమనించిన శ్రేయాఘోషల్ తల్లి, సంగీత విధ్వాంసుడు మహేష్చంద్ర దగ్గర చేర్పించారు. ఈయన దగ్గర శ్రేయా హిందుస్థాని సంగీతాన్ని నేర్చుకుంది. 12 ఏళ్ళకే ‘సరిగమప’షోలో పాల్గొని విజేతగా నిలిచింది. ఆ షోకు న్యాయ నిర్ణేతగ వ్యవహరించిన ప్రముఖ సంగీత దర్శకుడు కళ్యాన్ జీ షా దగ్గర సంగీతం నేర్చుకుంది.తర్వాత కొన్నేళ్ళకు మళ్లీ ‘సరిగమప’లో ఛాన్స్ వచ్చింది. దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాడు.
ఈ షోలో శ్రేయాఘోషల్ గొంతు నచ్చి భన్సాలీ ‘దేవదాసు’ సినిమాలో ఏకంగా ఐదు పాటలను పాడే అవకాశం ఇచ్చాడు. ఈ చిత్రంలోని ‘డోలారే’ పాటకు బెస్ట్ ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది. ఆ తరువాత ఈమెకు వరుసగా అవకాశాలు వచ్చాయి. కేవలం హిందీలోనే ఇప్పటి వరకు దాదాపు 850కు పైగా పాటలను పాడింది. మణిశర్మ సంగీతం వహించిన ‘ఒక్కడు’ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ‘నువ్వేం మాయ చేసావో’ సాంగ్ అప్పట్లో శ్రోతల చెవులలో మారుమోగిపోయింది. తరువాత తెలుగులోను బిజీయెస్ట్ సింగర్గా మారిపోయింది. తెలుగులో ఇప్పటివరకు దాదాపు 300 పాటలను ఆలపించింది. ఇండియాలోని దాదాపు అన్ని భాషల్లో ఈమె పాటలు పాడింది. పలు సంగీత షోలకు న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరించింది. 2015 ఫిబ్రవరి 5న తన చిన్ననాటి స్నేహితుడైన షిలాదిత్య ముఖోపాధ్యాయను వివాహం చేసుకుంది.
ఇండియాలోనే కాకుండా పాకిస్థాన్లో కూడా 8 సినిమాలలో పాటలు ఆలపించింది. ఇప్పటివరకు శ్రేయాఘోషల్ 20కు పైగా భాషల్లో 2400లకు పైగా పాటలు పాడింది. ఈమెకు నాలుగు నేషనల్ అవార్డులు, నాలుగు కేరళ స్టేట్ ఫిలిం అవార్డు, రెండు తమిళ స్టేట్ ఫిలిం అవార్డులు, ఏడు నార్త్ ఫిలిం ఫేర్ అవార్డులు, పది సౌత్ ఫిలిం ఫేర్ అవార్డులు, 7 ఐఫా అవార్డులు, 25 మిర్చి మ్యూజిక్ అవార్డులతో పాటు ఒక ఆనంద్లోక్ పురస్కారం, మూడు ఆనంద్ వికటన్ ఫిలిం అవార్డులతో పాటు పలు సంగీత అవార్డులను గెలుచుకుంది.