Shah rukh Khan | బాలీవుడ్ స్టార్ హీరోలు షారుఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్లకు అలహాబాద్ హైకోర్టు పెద్ద షాకిచ్చింది. గుట్కా పాన్ మసాలా యాడ్స్ చేసిన ఈ ముగ్గురు స్టార్ హీరోలకు కేంద్రం షోకాజ్ నోటీసులిచ్చామని తెలిపింది.
ఇంతకీ ఏం జరిగిందంటే.?
స్టార్ హీరోలు గుట్కా వంటి హానికారక ఉత్పత్తుల ప్రచార ప్రకటనల్లో పాల్గొనడంపై అభ్యంతరం వ్యక్తంచేస్తూ.. మోతీలాల్ యాదవ్ అనే న్యాయవాది గతంలో అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారత ప్రభుత్వం నుంచి గౌరవప్రదమైన పురస్కారాలు అందుకున్న వారు ఇలాంటి యాడ్స్లో నటించడం సరికాదంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో దీనిని విచారించిన కోర్టు.. పిటిషనర్ భ్యంతరాలపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఈ విచారణపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. మోతీలాల్ యాదవ్ మరోసారి కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ విషయంపై స్పందన కోరుతూ కోర్టు మరోసారి కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో దీనిపై స్పందించిన డిప్యూటీ సొలిసిటర్ జనరల్ శుక్రవారం కోర్టుకు సమాచారం అందించారు. ఇందులో భాగంగా ముగ్గురు బాలీవుడ్ స్టార్ హీరోలకు (అక్షయ్, షారుక్, అజయ్ దేవ్గణ్) అక్టోబర్ 22న షోకాజ్ నోటీసులు జారీ చేశామని వెల్లడించారు.