షారుఖ్ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘పఠాన్’ చిత్రం ఇటీవల విడుదలై ప్రపంచవ్యాప్తంగా అ ద్భుత విజయాన్ని సొంతం చేసుకు ంది. 500కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తున్నది. తాజాగా ఈ చిత్ర విజయోత్సవ వేడుకను ముంబయిలో నిర్వహించారు. ఇందులో కథానాయిక దీపికా పడుకోన్, దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్, జాన్ అబ్రహంతో పాటు చిత్రబృందం పాల్గొంది. చాలా ఏళ్ల తర్వాత అభిమానుల ముందుకొచ్చిన షారుఖ్ఖాన్ ‘పఠాన్’ సినిమా విడుదలకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు, వివాదాలపై స్పందించారు.
సమాజంలోని పౌరులందరూ ఆనందాన్ని పంచుకుంటూ ప్రేమ, దయ, సౌభ్రాతృత్వంతో జీవితాన్ని సాగించాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పారు. ‘సినిమా పరమార్థం ప్రేక్షకులకు వినోదాన్ని అందించడమే. ఇక్కడ ఎవరూ చెడ్డవాళ్లు కాదు. డర్, బాజీఘర్ చిత్రాల్లో నేను నెగెటివ్ పాత్రల్లో కనిపించా. నాలాగే జాన్ అబ్రహం కొన్ని చిత్రాల్లో ప్రతినాయకుడిగా నటించారు. అదంతా సినిమా వరకే. ఒకరి మనోభావాల్ని కించపరచాలనే ఉద్దేశ్యంతో ఎవరూ సినిమాలు తీయరు. సినిమాను కేవలం వినోదంగానే చూడండి’ అని షారుఖ్ఖాన్ వ్యాఖ్యానించారు. సినిమాల నిర్మాణంలో ఎలాంటి సాంస్కృతిక, ప్రాంతీయ విభేదాలు ఉండవని, సినిమా అనే గొప్ప కళ ద్వారా ప్రజలకు ఆనందాన్ని పంచడమే ఆర్టిస్టుల అంతిమ లక్ష్యమని షారుఖ్ఖాన్ స్పష్టం చేశారు.