మహిళలకు ప్రాధాన్యమున్న చిత్రంలో నటించడం సంతోషంగా ఉందని అంటున్నారు నటి ఊర్వశి. ఆమె కీలక పాత్రలో నటించిన సినిమా ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. శర్వానంద్ హీరోగా నటిస్తున్నారు. రష్మిక మందన్న నాయిక. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో దర్శకుడు కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల 25న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో నటించిన అనుభవాలను తెలిపారు నటి ఊర్వశి. ఆమె మాట్లాడుతూ….‘చాలా విరామం తర్వాత మహిళలకు ప్రాముఖ్యత ఉన్న చిత్రంలో నటించాను. ప్రతి సన్నివేశంలో ఐదుగురు మహిళలు కనిపిస్తారు. వీళ్ల పాత్రలన్నింటికీ సమాన ప్రాధాన్యత ఉండటం కథలోని ప్రత్యేకత. రాధిక, ఖుష్బూలతో అనేక చిత్రాల్లో నటించాను. మళ్లీ ఈ సినిమాతో మా కాంబినేషన్ కుదిరింది. కుటుంబంతో కలిసి చూడాల్సిన చిత్రమిది. శర్వానంద్, రష్మిక జోడి బాగుంటుంది’ అన్నారు.