Mannava Balayya | ప్రముఖ సీనియర్ టాలీవుడ్ నటులు బాలయ్య ఏప్రిల్ 9న ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. దాదాపు యాభై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించారు. అలాగే నిర్మాతగా, దర్శకుడిగా కూడా సత్తా చూపించారు. హైదరాబాద్ యూసఫ్గూడలోని తన స్వగృహంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖులు అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఎత్తుకు పైఎత్తు చిత్రంతో నటుడయ్యారు బాలయ్య. ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు బాలయ్య. నిర్మాతగా, దర్శకుడుగా, కథా రచయితగా తన ప్రతిభ చూపారు. నిర్మాతగా అమృత ఫిల్మ్స్ సంస్థలో శోభన్ బాబు హీరోగా చెల్లెలి కాపురం, సూపర్ స్టార్ కృష్ణ హీరోగా కె.విశ్వనాధ్ దర్శకత్వంలో నేరము – శిక్ష, చుట్టాలున్నారు జాగ్రత్త, మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఊరికిచ్చిన మాట లాంటి చిత్రాలు నిర్మించారు. అక్కడితో ఆగకుండా దర్శకుడిగా పసుపు తాడు, నిజం చెబితే నేరమా, పోలీసు అల్లుడు, రూపొందించారు. ఉత్తమ కథా రచయితగా ఊరికిచ్చిన మాట చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. చెల్లెలి కాపురం చిత్రానికి నిర్మాతగా నంది అవార్డు అందుకున్నారు. బాలయ్య కుమారుడు తులసీరామ్ కూడా కొన్ని చిత్రాల్లో నటించారు.
బాలయ్య గురించి ఈ విషయాలన్నీ చాలామందికి తెలుసు కానీ ఒక తెలియని విషయం కూడా ఉంది ఆయన చనిపోయిన రోజు.. పుట్టిన రోజు రెండు ఒకటే కావడం గమనార్హం 1930 ఏప్రిల్ 9న ఆయన జన్మించారు. సరిగ్గా 92 సంవత్సరాల తర్వాత 2022 ఏప్రిల్ 9న ఆయన కన్నుమూశారు.