టాలీవుడ్లో పేరున్న కొరియోగ్రాఫర్స్ను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. వాళ్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు శేఖర్ మాస్టర్. అగ్ర హీరోలతో ఆయన చేయించిన డ్యాన్సులు పాపులర్ అయ్యాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తర్వాత శేఖర్ మాస్టర్ మహేష్బాబుకు కొరియోగ్రాఫ్ చేసిన సినిమా ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. కీర్తి సురేష్ నాయిక. నవీన్ యేర్నేని, రవి శంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. నిర్మాణంలో మహేష్బాబు భాగమయ్యారు. మే 12న ఈ సినిమా విడుదలవుతున్న సందర్భంగా శేఖర్ మాస్టర్ సినిమాకు పనిచేసిన అనుభవాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ…‘మహేష్ బాబులో ఒక ైస్టెల్ ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకుని ఆయనకు స్టెప్స్ డిజైన్ చేస్తుంటాను.
గతంలో ‘సరిలేరు నీకెవ్వరు’లో మైండ్ బ్లాక్ పాట హిట్ అయ్యింది. ఇందులో మూడు పాటలకు కొరియోగ్రాఫ్ చేశాను. కళావతి, పెన్నీ పాటలు ఇప్పటికే రిలీజై విజయం సాధించాయి. త్వరలో ఓ మాస్ సాంగ్ రిలీజ్ చేయబోతున్నాం. ఈ పాటలో మహేష్ చేసిన డ్యాన్స్ మూవ్మెంట్స్ కొత్తగా అనిపిస్తాయి. ఓ పాట కొరియోగ్రాఫ్ చేసేప్పుడు కాస్ట్యూమ్స్, వెనక బ్యాక్ గ్రౌండ్ ప్రాపర్టీస్ వరకు ప్రతీది మేము చూసుకుంటాం. కళావతి పాటలో డ్యాన్సర్స్ వీణ వాయిస్తుంటారు..ఇలా పాటకు ఏం ఉంటే బాగుంటాయి అనుకుంటామో అవన్నీ కొరియోగ్రఫీలో భాగమే అనుకుంటా. చెప్పే స్టెప్స్ మహేష్ చాలా త్వరగా నేర్చుకుంటారు. ఎంత కష్టమైన స్టెప్స్ అయినా చేస్తానంటారు.
బాగా వచ్చినా మళ్లీ చేద్దామా అని అడుగుతుంటారు. ఆయన సినిమాల్లో ఇంకా డ్యాన్సులు కావాలని కోరుకునే వారికి ఈ సినిమా పాటలు ఆన్సర్ ఇస్తాయి. పాటల్లో రిథమ్ను బట్టే స్టెప్స్ కొరియోగ్రాఫ్ చేస్తాం. డ్యాన్స్ మూవ్మెంట్స్ మాత్రమే కాదు ఆ పాటను విజువల్గా ప్రెజంట్ చేయడమే నా పని. పాన్ ఇండియా సినిమాలకు కూడా మనదైన స్టెప్స్కే పేరొస్తుంటుంది. దాని కోసం ప్రత్యేకంగా మూవ్మెంట్స్ క్రియేట్ చేయక్కర్లేదు. కొన్ని విభిన్నమైన స్టెప్స్ చేస్తే అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గతంలో మన దగ్గర డ్యాన్సర్ల కొరత ఉండేది. చెన్నై మీద ఆధారపడేవాళ్లం. ఇప్పుడా పరిస్థితి లేదు. స్థానికంగా కావాల్సినంత మంది డ్యాన్సర్స్ తయారయ్యారు. ప్రస్తుతం చిరంజీవి బాబీ చిత్రం, రవితేజ ‘ధమాకా’, శింభు, శివకార్తికేయన్ సినిమాలతో పాటు మరికొన్ని ప్రాజెక్టులకు పనిచేస్తున్నాను. రాజమౌళి, పవన్ కళ్యాణ్ గారి చిత్రాలకు పనిచేయాలని ఉంది’ అన్నారు.