సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar Kammula) మనస్సుకు దగ్గరగాఉండే సినిమాలు చేయడమే కాకుండా…సమాజంలో జరుగుతున్న విషయాలపై కూడా ఆయన స్పందిస్తుంటారు.కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ.. ఫ్రంట్లైన్ వారియర్స్గా సేవలందించిన పారిశుద్ధ్య కార్మికులకు తన వంతు సాయం చేశారు. ఆయన ప్రొడక్షన్ హౌస్ అమిగోస్ నుంచి వెయ్యి మంది కార్మికులకు నెల రోజుల పాటు పాలు, మజ్జిగ అందించారు.
ఇక తాజాగా ఓ రైతుకి లక్ష రూపాయాలు సాయం అందించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో ఈనెల 21వ తేదీన కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిళ్లు దగ్ధమైంది. ఈ క్రమంలో..కష్టపడి సంపాదించుకున్న సొమ్ము రూ. 6 లక్షలు బీరువాలో దాచుకున్నాడు. ఇల్లు దగ్ధం కావడంతో..దాచుకున్న సొమ్ము అంతా మంటలలో కాలింది.
దీంతో లక్ష్మయ్య బాధ వర్ణనాతీతంగా మారింది. బాధతో బోరున విలపిస్తున్న లక్ష్మయ్య బాధని గ్రహించిన శేఖర్ కమ్ముల రైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు. నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు లక్ష రూపాయలు పంపించారు. రైతు కుటుంబంతో మాట్లాడిన ఆయన అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కమ్ముల మంచి మనసుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.