మన దగ్గర స్టార్ హీరోలు ఎలా ఉంటారో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. అదొక రకమైన ఆటిట్యూడ్ అందరిలోనూ కనిపిస్తుంది. కొందరు మాత్రమే చాలా ఫ్రీగా కనిపిస్తుంటారు. స్టార్ హీరోల దగ్గరికి వెళ్లాలంటే ఏదో తెలియని ఒక ఇమేజ్ చట్రం చుట్టూ ఉంటుంది. స్టార్ హీరోల దగ్గరికి వెళ్లేటప్పుడు ఎంత పెద్ద నిర్మాత, దర్శకుడు అయినా కూడా చాలా జాగ్రత్తగా వినయంగా వుంటారు. అలా ఉండేలా మన హీరోలు ఒక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. అయితే తాజాగా తమిళ స్టార్ హీరో ధనుష్ వినయం చూసి మన దర్శకుడు శేఖర్ కమ్ముల ముచ్చట పడ్డాడు.
ఇన్నాళ్ళూ తమిళ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమైన ధనుష్.. ఇప్పుడు తెలుగులోకి కూడా అడుగు పెడుతున్నాడు. ఇప్పటికే ఈయనకు హిందీలో కూడా మంచి ఇమేజ్ ఉంది. అక్కడ మూడు నాలుగు సినిమాలు చేశాడు ధనుష్. వాటితో మంచి మార్కెట్ సొంతం చేసుకున్నాడు. తాజాగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పాన్ ఇండియన్ సినిమా చేయబోతున్నాడు ధనుష్. పొలిటికల్ నేపథ్యంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తుంది. ఇందులో ధనుష్ పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతుందని శేఖర్ కమ్ముల చెప్తున్నాడు.
ఇప్పటి వరకు స్టార్ హీరోలతో వర్క్ చేయని శేఖర్.. ఒకేసారి ధనుష్ లాంటి స్టార్ హీరోను సెట్ చేసాడు. ఈ కాంబినేషన్ అనౌన్స్ అయిన తర్వాత హైదరాబాద్ కు రాలేదు ధనుష్. కానీ ఇప్పుడు దర్శకుడు శేఖర్ కమ్ములతో పాటు నిర్మాతలను కూడా కలిసాడు. వాళ్ల దగ్గర ధనుష్ నిలబడిన తీరు చూసి అంతా ఫిదా అయిపోయారు. ముఖ్యంగా అక్కడ అంత స్టార్ డమ్ ఉన్న హీరో.. చాలా వినయంగా, కొత్త హీరోలా చేతులు కట్టుకుని నిలబడ్డాడు. అది చూసి ఫ్యాన్స్ కూడా ఖుషీ అయిపోతున్నారు.
అంతటి ఇమేజ్ ఉండి కూడా ఇంత సింపుల్ గా ఉన్నాడు కాబట్టే ధనుష్ రేంజ్ అలా పెరిగిపోయింది అంటూ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరోవైపు శేఖర్ కమ్ముల అయితే ధనుష్ తో వర్క్ చేయడానికి చాలా ఆసక్తిగా ఉన్నాడు. ఎప్పుడెప్పుడు సినిమా మొదలు పెడదామా అని చూస్తున్నాడు. అంతగా తన వినయంతో ఫిదా చేసాడు రజినీకాంత్ అల్లుడు