ముంబై: సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, మహ్మద్ అజారుద్దీన్.. ఇప్పటి వరకూ బయోపిక్ల లిస్ట్లో ఉన్న క్రికెటర్లు వీళ్లు. తాజాగా ఈ లిస్ట్లో ఇండియన్ టీమ్ మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చేరనున్నారు. తన బయోపిక్కు దాదా ఓకే చెప్పారు. ఈ మూవీని రూ.200 కోట్ల నుంచి రూ.250 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కించనున్నారు. లీడ్ రోల్లో రణ్బీర్ కపూర్ కనిపించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. న్యూస్ 18 బంగ్లా చానెల్తో మాట్లాడిన గంగూలీ.. బయోపిక్ తాను అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ మూవీ హిందీలో తెరకెక్కనుంది. అయితే డైరెక్టర్ ఎవరో ఇప్పుడే చెప్పలేను. అన్ని విషయాలను వెల్లడించడానికి ఇంకాస్త సమయం ఉంది అని గంగూలీ అన్నారు.
ఈ మూవీకి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్దమైనట్లు సమాచారం. ఈ మూవీని తెరకెక్కిస్తున్న నిర్మాణ సంస్థ ఇప్పటికే పలుమార్లు గంగూలీని కలిసి మాట్లాడింది. ఈ మూవీలో దాదా రోల్ను ప్లే చేయడానికి రణ్బీర్ ముందు వరసలో ఉన్నాడు. మరో ఇద్దరిని కూడా పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన క్యారెక్టర్కు హృతిక్ రోషన్ సరైన చాయిస్ అన్న నేహా ధూపియా కామెంట్స్పైనా గంగూలీ స్పందించారు.
అలా అయితే హృతిక్ ముందు నాలాంటి శరీరాకృతిని పొందాలి. చాలా మంది హృతిక్ బాడీ చాలా బాగుంటుంది. అతనిలాంటి బాడీ ఉండాలనుకుంటారు కానీ అతడు నా పాత్ర పోషించాలంటే నా బాడీని పొందాల్సి ఉంటుంది అని గంగూలీ అన్నారు. గంగూలీ మొత్తం జీవితాన్ని ఈ చిత్రం ఆవిష్కరించనుంది. యువ క్రికెటర్ స్థాయి నుంచి టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్గా, బీసీసీఐ అధ్యక్షుడిగా ఎదిగిన తీరును చూపించనుంది.