Sapta sagaralu Daati (Side B) | కన్నడ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో సైడ్-ఏ’ (Sapta Sagaradaache Ello). చార్లీ ఫేం రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి (Rukmini) కథానాయికగా నటించింది. హేమంత్ రాజ్ (Hemanth Raj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 01న కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. ఇదే సినిమాను ‘సప్త సాగరాలు దాటి సైడ్-ఏ’ (Sapta Sagaralu Dhaati) అనే పేరుతో తెలుగులో సెప్టెంబర్ 22న విడుదల చేశారు. అయితే ఈ సినిమాకు కన్నడలో వచ్చినంత రెస్పాన్స్ మాత్రం తెలుగులో రాలేదు. దానికి ముఖ్య కారణం ఈ సినిమా తెలుగులో విడుదలైన వారం రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేసింది.
దీంతో థియేటర్లో చూద్దామనుకున్న ప్రేక్షకులంతా ఓటీటీకి షిఫ్ట్ అయిపోయారు. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యాక బ్లాక్ బస్టర్గా నిలిచింది. కానీ ఇది తొలిపార్టు మాత్రమే. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పడు చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సెకండ్ పార్ట్ విడుదల తేదీ కూడా వచ్చింది. ఇక ఈ రెండో భాగం ‘సప్త సాగరాలు దాటి సైడ్-బీ’ (Sapta Sagaralu Dhaati Side-B) నవంబర్ 17న కన్నడతో పాటు మూడు భాషల్లో రిలీజ్ కానుంది. ఇక తెలుగులో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది.
అయితే సెకండ్ పార్ట్కు అయిన ప్రేక్షకులు థియేటర్ వస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాను చూసే ప్రేక్షకుల కోసం టికెట్ రేట్లు కూడా తగ్గించినట్లు మేకర్స్ తెలిపారు. మరోవైపు శుక్రవారం ఈ సినిమాతో పాటు ‘మంగళవారం’, ‘స్పార్క్’, ‘మై నేమ్ ఈజ్ శృతి’ సినిమాలు కూడా విడుదల కానున్నాయి.
సప్త సాగరాలు దాటి సైడ్-ఏ కథ విషయానికొస్తే.. మను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణి) అనే మధ్య తరగతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటుంటారు. పెళ్లిచేసుకుని జీవితంలో చాలా సాధించాలని, గొప్పగా ఎదగాలని కలలు కంటుంటారు. మరీ ముఖ్యంగా సముద్రం పక్కన ఓ అందమైన ఇల్లు కట్టుకుని కుంటుంబంతో కలిసి హ్యాపీగా జీవించాలని అనుకుంటారు. అయితే ఓ రాంగ్ డిసీషన్ వల్ల వీళ్ల జీవితాలు తలకిందులైపోతాయి. రక్షిత్ శెట్టి జైలుకు అంకితమైపోతాడు. ఆ తర్వాత ఏం జరిగింది? రక్షిత్ శెట్టి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? చివరకి జైలు నుంచి రక్షిత్ బయటకు వచ్చాడా? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.