‘ఈ నెల 18న హైదరాబాద్లో సంతోషం ఓటీటీ అవార్డ్స్, డిసెంబర్ 2న గోవాలో సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్ ఘనంగా నిర్వహించనున్నాం. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా’ అన్నారు నిర్మాత సురేశ్ కొండేటి. ఆయన ప్రతి ఏడాదీ సంతోషం ఫిల్మ్ అవార్డుల వేడుక నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది నిర్వహించే వేడుక గురించి ఆయన విలేకరులతో ప్రత్యేకంగా మాట్లాడారు. ‘పాతికేండ్లు ఈ వేడుక జరపాలనుకున్నాను.
22ఏండ్లు పూర్తయ్యాయి. ఇంకో మూడేండ్లు కచ్చితంగా చేస్తా. అగ్రనటులు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇంత సాధించగలిగాను. సురేశ్ ఫిలింఫేర్ స్థాయిలో అవార్డుల వేడుక నిర్వహించగలడని ఆనాడు నాగార్జున నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే కసితో కృషితో ఈ వేడుకను ఇన్నాళ్లూ ఘనంగా చేశాను.
రాష్ట్ర స్థాయి నుంచి జాతీయస్థాయికి సంతోషం పండుగ ఎదిగింది. డిసెండర్ 2న గోవాలో జరుగనున్న వేడుకకు దేశవ్యాప్తంగా వందల సంఖ్యలో సినీ కళాకారులు రానున్నారు. ప్రేక్షకులు వేలల్లో రాబోతున్నారు. ఆ డేట్కి ఫ్లయిట్ టికెట్లు కూడా దొరకని పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సహకరిస్తున్న గోవా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా’ అన్నారు సురేశ్ కొండేటి.