సినీరంగంలో అవకాశాలను అందిపుచ్చుకొని విజయాలు సాధించడం అంత సులభం కాదు. ఎన్నో విఫల యత్నాలు ఎదురైతేకానీ కోరుకున్న సక్సెస్ దొరకదు. కెరీర్ ఆరంభంలో దర్శకుడు సందీప్రెడ్డి వంగాకు అలాంటి అనుభవాలే ఎదురయ్యాయట. విజయ్దేవరకొండతో ఆయన తీసిన ‘అర్జున్ రెడ్డి’ ఓ కల్ట్మూవీగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. తొలుత ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించాలని అనుకున్నాడట సందీప్ రెడ్డి. అయితే ఆయన్ని కలిసే అవకాశం రాకపోవడంతో విజయ్ దేవరకొండతో ఆ సినిమా తీశానని చెప్పాడు.
‘యానిమల్’ బ్లాక్బస్టర్ విజయంతో దర్శకుడు సందీప్రెడ్డి వంగా జోష్ మీదున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ‘2011లోనే అల్లు అర్జున్కు ఓ కథ చెప్పాను. అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. అనంతరం ‘అర్జున్ రెడ్డి’ కథను అల్లు అర్జున్కు చెప్పాలనుకున్నా. కానీ ఆయన్ని కలిసే వీలులేకుండా పోయింది. ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా విజయ్ దేవరకొండ పరిచయమం కావడంతో ఆయనతో ఆ సినిమా తీశాను. దాదాపు 13 ఏండ్ల విరామం తర్వాత అల్లు అర్జున్తో కలిసి పనిచేసే అవకాశం దక్కింది. దేనికైనా టైమ్ రావాలి’ అని చెప్పారు. ప్రభాస్ హీరోగా సందీప్రెడ్డి వంగా ‘స్పిరిట్’ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. దీని తర్వాత అల్లు అర్జున్ సినిమా పట్టాలెక్కనుంది.