‘నిజానికి మా టైటిల్ ‘మెన్షన్ హౌస్ మల్లెష్’. అయితే.. ఓవర్ లుక్లో టైటిల్ ‘మాన్షన్ హౌస్ మల్లేష్’ అనిపిస్తుంది. ఈ కథకు టైటిల్ క్యాచీగా ఉండాలి. అందుకే ఈ టైటిల్ పెట్టాం. దారితప్పిన ఓ పొగరుబోతుని అతని తల్లి, భార్య ఎలా దారిలోకి తెచ్చారు? అనే ప్రశ్నకు సమాధానమే ఈ సినిమా’ అని హీరో శ్రీనాథ్ మాగంటి అన్నారు. ఆయన హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘మెన్షన్ హౌస్ మల్లేష్’. గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల కథానాయికలు. బాల సతీష్ దర్శకుడు. రాజేష్ నిర్మాత. ఈ నెల 6న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్లో హీరో శ్రీనాథ్ మాగంటి విలేకరులతో ముచ్చటించారు. ‘ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో నేను కొత్తగా కనిపిస్తా. ఈ పాత్ర కోసం రియల్ కేరక్టర్లని అబ్జర్వ్ చేశా. మా అమ్మ పాత చున్నీ ఉంటే, దాన్ని చొక్కాగా కుట్టించుకొని వేసుకున్నా. మల్లేష్గా మారడానికి నిజంగా చాలా కష్టపడ్డాను. దర్శకుడు బాలసతీశ్ క్లారిటీ ఉన్న దర్శకుడు. ఈ సినిమాతో కచ్చితంగా అతనికి మంచి పేరొస్తుంది. నిర్మాత రాజేష్ ఎక్కడా రాజీ పడలేదు. సాంకేతికంగా అన్ని విధాలా సినిమా బావుంటుంది’ అని శ్రీనాథ్ మాగంటి తెలిపారు.