సందీప్ మాధవ్, గాయత్రి ఆర్ సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘గంధర్వ’. యాక్షన్ గ్రూప్ సమర్పణలో ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఎస్కే ఫిలింస్ సహకారంతో నిర్మిస్తున్నారు. సబాని నిర్మాత. అప్సర్ దర్శకత్వం వహిస్తున్నారు. జూలై 1న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర పోస్టర్, లిరికల్ పాటను హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ…‘ఫిక్షన్ కథతో ఈ సినిమా సాగుతుంది. నా గత చిత్రాలకు భిన్నంగా ఉంటుందని చెప్పగలను. ఆసక్తికరమైన కథ, కథనాలతో నిర్మాణపరంగా ఉన్నతంగా ఉంటుంది. భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి’ అన్నారు. నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ..‘నా అనుభవంలో ఎన్నో సినిమాలు చూశాను. కానీ ఇందులో ఉన్న పాయింట్తో ఇప్పటిదాకా మరే సినిమా రాలేదు. ఈ సినిమా రిలీజ్ చేయడాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నా’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్రబృందంతో పాటు సాయికుమార్, బాబుమోహన్ తదితరులు పాల్గొన్నారు.