విడాకుల అనంతరం తనపై సోషల్మీడియా వేదికల్లో అనేక రకాలుగా అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని సమంత ఆవేదన వ్యక్తం చేసింది. తన వ్యక్తిగత వ్యవహారంలో చొరబడి తమ మానసిక శక్తులన్నింటిని ప్రయోగిస్తున్న వారందరిని చూస్తే ఎంతో ఉత్తేజంగా అనిపిస్తున్నదని వ్యంగ్యాత్మక ధోరణిలో వ్యాఖ్యానించింది. తనపై సానుభూతి ప్రకటిస్తున్న వారందరికి కృతజ్ఞతలు అంటూ చురకలంటించింది. ఈ మేరకు ఆమె ట్విట్టర్లో ఓ పోస్ట్ చేసింది. ‘నా గురించి అవాస్తవాల్ని ప్రచారం చేస్తున్నారు. నాకు ఎఫైర్స్ ఉన్నాయని, పిల్లల్ని వద్దనుకున్నానని, అబార్షన్ కూడా చేయించుకున్నానని, నేనొక అవకాశవాదినని ఇష్టారీతిన వ్యక్తిగతంగా దాడి చేశారు. విడాకులు తీసుకోవడం ఎంతో బాధాకరమైన వ్యవహారం. నా గాయాలు మానేందుకు కాస్త సమయం ఇవ్వండి. అయితే నేను ఒక్క విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పలగలను..అదేమిటంటే ఎలాంటి పన్నాగాలు, ప్రయత్నాలు చేసినా నేను బెదిరిపోను. ధైర్యంగా నిలబడతా’ అని సమంత పేర్కొంది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్మీడియాలో వైరల్గా మారింది. సోషల్మీడియాలో సమంతపై ట్రోల్స్ చేస్తున్నవారందరికి ఈ తాజా ట్వీట్ ఓ చెంపపెట్టు లాంటిదని ఆమె అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.