వెండితెరపై తనదైన చక్కటి అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించడమే కాదు..తాత్విక భావాల స్ఫూర్తితో జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూస్తుంటుంది అగ్ర కథానాయిక సమంత. కొద్ది నెలల క్రితం ఆమె మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సమంత కోలుకుంటున్నదని, త్వరలోనే కెమెరా ముందుకొస్తుందని ఆమె సన్నిహితులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం సమంత తన తాజా చిత్రం ‘శాకుంతలం’ డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నది. ఈ సందర్భంగా డబ్బింగ్ చెబుతున్న ఫొటోను గురువారం ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.ఈ ఫొటోకు ఫిలాసఫికల్ పంథాలో ఓ కొటేషన్ను జత చేసింది. ‘నాలోని అన్ని భయాలకు, బాధలకు కళనే గొప్ప సాంత్వన. ఈ ప్రపంచంలో నేను ఒంటరినయ్యానని ఆవేదన చెందుతున్నప్పుడు తిరిగి నన్ను జీవన పథంలో నడిపించేది కళనే’ అంటూ సమంత పేర్కొంది.
వ్యాధిపై పోరాడి విజయం సాధించాలని ఆమె కృతనిశ్చయంతో ఉందనడానికి ఈ మాటలే నిదర్శనమని, తిరిగి సమంత పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని నెటిజన్లు ఆకాంక్షిస్తున్నారు. శకుంతల, దుష్యంతుడి ప్రణయగాథ ఆధారంగా పౌరాణిక కథాంశంతో రూపొందిన ‘శాకుంతలం’ చిత్రం ఫిబ్రవరి 17న పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందు కురానుంది.