కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇచ్చిన ధైర్యంతోనే జీవితంలోని కష్టాల్ని జయించగలిగానని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ఆమె టైటిల్ రోల్ను పోషించిన పాన్ ఇండియా చిత్రం ‘శాకుంతలం’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమయంలో తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి సమంత ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించింది. ఆమె మాట్లాడుతూ ‘నా వ్యక్తిత్వాన్ని దగ్గరి నుంచి గమనించిన వారు నేను స్వతంత్ర భావాలతో పెరిగిన బలమైన మహిళ అనుకుంటారు. కానీ వాస్తవంలో నాది సున్నితమైన హృదయం. కష్టాలకు చలించిపోతాను. విడాకులు తీసుకున్న సమయంలో చీకటి రోజుల్ని చూశా. మనసు స్థిమితంగా ఉండేది కాదు. ఏవో అర్థంలేని ఆలోచనలు చుట్టుముట్టేవి. ఈ కష్టాల నుంచి ఎప్పుడు గట్టెక్కుతానని ప్రతి రోజూ అమ్మని అడిగేదాన్ని. అయితే కాలం అన్నింటికి పరిష్కారం చూపిస్తుంది. గతంతో పోల్చితే ఇప్పుడు మనసుకు కాస్త సాంత్వన దొరికింది. కష్టాల్ని దాటివస్తేనే మనలో ధైర్యం పెరుగుతుంది. ఏ కష్టమైనా శాశ్వతంగా ఉండిపోదనే నిజాన్ని తెలుసుకోవాలి. నా స్నేహితులు, కుటుంబ సభ్యులు ఇచ్చిన మానసిక స్థైర్యంతోనే త్వరగా కోలుకున్నా’ అని చెప్పింది.