జీవితాన్ని ఎలాంటి కష్టాలు చుట్టుముట్టినా సానుకూల దృక్పథంతో ఆలోచించాలని, కాస్త ఓపిక పడితే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక సమంత. మయోసైటిస్ అనే అరుదైన కండరాల వ్యాధి బారిన పడి కోలుకుంటున్న ఆమె ప్రస్తుతం సినిమా షూటింగ్స్లో పాల్గొంటున్నది. త్వరలో తెలుగు ‘ఖుషి’ సినిమా సెట్స్లో జాయిన్ కానుంది. గత కొద్దిరోజులుగా సమంత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో స్ఫూర్తినిచ్చే మాటల్ని పోస్ట్ చేస్తున్నది.
పరిస్థితులన్నీ క్రమంగా సర్దుకుంటున్నాయని, తాను కష్టాల నుంచి బయటపడుతున్నానని తన తాజా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పేర్కొంది. ‘ గత కొన్ని నెలలుగా ఇబ్బందికరమైన రోజుల్ని చూస్తూ ధైర్యంగా ఉన్నావు. నీ విషయంలో నేను గర్వంగా ఫీలవుతున్నా. మరింత ధైర్యంగా ముందుకు సాగిపో’ అంటూ తనకి తాను ధైర్యవచనాలు చెప్పుకుంటూ సమంత పెట్టిన పోస్ట్ వైరల్గా మారింది. తాజాగా ‘సిటాడెల్’ షూటింగ్కు బయల్దేరుతూ కారులో ప్రయాణిస్తున్న ఫొటోను షేర్ చేసింది. దానికి ‘వెలుతురు కోసం మనమే అన్వేషించాలి’ అనే వ్యాఖ్యను జోడించింది.