అగ్ర కథానాయిక సమంత చాలా రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చింది. మయోసైటిస్ అనే కండరాల వ్యాధి నుంచి కోలుకుంటున్న ఆమె గత కొంతకాలంగా ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. సమంత టైటిల్ రోల్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక ప్రేమకావ్యం ‘శాకుంతలం’ ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం సోమవారం హైదరాబాద్లో జరిగింది.
ఈ వేదికపై సమంత భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకోవడంతో ఒక్కసారిగా అక్కడ ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 17న విడుదలకానుంది. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ‘గుణశేఖర్ మీదున్న గౌరవంతో ఓపిక లేపోయినా నా బలాన్నంతా కూడదీసుకొని ఇక్కడకు వచ్చాను. గుణశేఖర్ ఈ సినిమాను ప్రాణం పెట్టి తీశారు. ‘శాకుంతలం’ చూశాక మన ఊహకు మించిన అద్భుతమైన చిత్రమనే భావన కలిగింది.
ఈ సినిమాలో భాగం కావడం నా అదృష్టంగా భావిస్తున్నా. నేను జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఒక్కటి మాత్రం మారలేదు. సినిమాను నేను ఎంతగా ప్రేమిస్తానో..సినిమా కూడా నన్ను అంతే ప్రేమిస్తున్నది. ‘శాకుంతలం’ చిత్రంతో ఆ ప్రేమ మరింత పెరుగుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పింది. ‘ఈ కథలో హీరో దేవ్మోహన్ అయితే..సినిమాకు సమంత హీరో. దిల్రాజు అండగా ఉండటం వల్ల ఈ సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కించగలిగాను. మన పురాణాల్లోని అద్భుతమైన కథల్ని నేటి తరానికి చెప్పాలని నా కుమార్తె నీలిమ అనుకుంది.
ఈ కథకు సమంత అయితేనే బాగుంటుందని చెప్పింది. ఒక్క హీరోయిన్ను నమ్మి దిల్రాజు సినిమా కోసం ఇన్ని కోట్లు పెట్టినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ అని గుణశేఖర్ తెలిపారు. దిల్రాజు మాట్లాడుతూ ‘గుణశేఖర్ మూడేళ్ల శ్రమకు నిదర్శనం ‘శాకుంతలం’. సమంత అద్భుతంగా నటించింది. ఇది ఒరిజినల్ పాన్ ఇండియా సినిమా. ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నాం’ అన్నారు.