సినీరంగంలో మహిళాసాధికారత, అవకాశాల కల్పన కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పింది అగ్ర కథానాయిక సమంత. ప్రతిభను ప్రదర్శించే సరైన వేదికల్ని అందిపుచ్చుకోవడమే మహిళల ముందున్న పెద్ద సవాలు అని ఆమె పేర్కొంది. బాలీవుడ్ ‘ది ఫ్యామిలీమెన్-2’ సిరీస్ ద్వారా ఈ అమ్మడి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. అందులో తమిళ రెబల్ రాజీ పాత్రలో చక్కటి అభినయంతో అందరి ప్రశంసలందుకుంది. తన పదకొండేళ్ల సుదీర్ఘ కెరీర్లో రాజీ తరహా పాత్రను ఎవరూ ఆఫర్ చేయలేదని, తన ప్రతిభాపాటవాల్ని పూర్తిస్థాయిలో ప్రదర్శించే అవకాశం ఆ పాత్ర ద్వారా లభించిందని సమంత ఆనందం వ్యక్తం చేసింది. చిత్రసీమలో మహిళలకు వీలైనన్ని ఎక్కువ అవకాశాలు కల్పించడమే తన సరికొత్త లక్ష్యమని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘భవిష్యత్తులో మహిళా డైరెక్టర్స్, టెక్నీషియన్స్తో కలిసి పనిచేయాలనుకుంటున్నా. వారికి అవకాశాలు కల్పించి పైకి తీసుకురావడం ప్రధానంగా భావిస్తున్నా. నాలాగే ఎంతో మంది ప్రతిభావంతులైన మహిళలు సినీరంగంలో ఉన్నారు. అవకాశాలు లేక వారు రాణించడం లేదు. మహిళలు పరస్పరం సహకరించుకుంటే భవిష్యత్తు బంగారుమయం అవుతుంది. అలాగే మహిళా నేపథ్య ఇతివృత్తాల్ని విరివిగా రాయాలని రచయితల్ని కోరుతున్నా’ అని సమంత పేర్కొంది. తెలుగులో ఆమె నటిస్తున్న ‘శాకుంతలం’ ఇటీవల చిత్రీకరణ పూర్తిచేసుకుంది.