గత ఏడాది మయోసైటిస్ అనే అరుదైన ఆటోఇమ్యూన్ డిసీజ్ బారిన పడింది అగ్ర కథానాయిక సమంత. దాదాపు ఆరు నెలల చికిత్స అనంతరం ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో బయటికొచ్చి సెట్స్లోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం సమంత హిందీ ‘సిటాడెల్’ చిత్రీకరణ కోసం సెర్బియాలో ఉంది. మయోసైటిస్ నిర్ధారణ జరిగిన ఏడాది పూర్తయిన సందర్భంగా వ్యాధిపై తన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ సమంత ఇన్స్టాగ్రామ్లో ఓ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టింది. ‘నేను సాధారణ జీవితంలోకి అడుగుపెట్టడానికి ఏడాది కాలం పట్టింది. ఈ క్రమంలో నా శరీరం ఎంతో బాధను భరించింది.
అన్ని రుచులకు దూరంగా కేవలం ఔషధాలే ఆహారంగా బతకాల్సి వచ్చింది. అయితే భారంగా సాగుతున్న ఈ రోజులు నాకు జీవితార్థాన్ని తెలియజెప్పాయి. ఆత్మపరిశీలన చేసుకునేందుకు కావాల్సిన సమయం దొరికింది. నాకు ఎలాంటి సంపదలు, బహుమానాలు వద్దని.. శారీరక బలాన్ని, మనశ్శాంతిని మాత్రమే ప్రసాదిస్తే చాలని ఆ దేవుడిని కోరుకున్నా’ అంటూ సమంత ఎమోషనల్గా వ్యాఖ్యానించింది. ఆమె విజయ్ దేవరకొండ సరసన కథానాయికగా నటిస్తున్న ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది.