సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. వెంకటేష్ మరో ముఖ్య పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. పాటల విషయంలో ఈ చిత్ర సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, హీరో సల్మాన్ఖాన్ మధ్య విభే దాలు వచ్చాయనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పాటలు నచ్చకే దేవిని సల్మాన్ఖాన్ సంగీత బాధ్యతల నుంచి తప్పించారని ఈ వార్తల సారాంశం. అయితే ఈ వదంతులపై స్పష్టతనిచ్చారు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. ఆయన మాట్లాడుతూ…‘సల్మాన్ సినిమాల్లో సంగీతం అంటే నాకు ఇష్టం. ఈ సినిమా కోసం నన్ను సంప్రదించే సమయానికే వాళ్లు కొన్ని పాటలు చేసి పెట్టుకున్నారు.
అయినా దర్శకుడు ఫర్హాద్ సమ్జీ మ్యూజిక్లో భాగంకావాలని అడిగారు. నేను కథతో సహా వాళ్లు చేసిన పాటలు, ఇంకా చేయాల్సినవి అడిగి తెలుసుకున్నాను. అలా ఒక మంచి డ్యాన్స్ నెంబర్ను కంపోజ్ చేశాను. ఇటీవలే సల్మాన్తో కలిసి ఆ పాటను చూశాను. అంతేగానీ నన్ను సినిమా నుంచి తప్పించడం అనేది జరగలేదు’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపర్చిన ‘ఆర్య 2’ లోని రింగ రింగా, ‘దువ్వాడ జగన్నాథం’ సినిమాలోని సీటీ మార్ పాటలను సల్మాన్ తన సినిమాల్లో తీసుకుని స్టెప్పులేశారు. ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ చిత్రానికి ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.