భయాల్ని అధిగమించి జీవితాన్ని ఓ ఉత్సవంలా జరుపుకోవాలని, తాను నటించిన తాజా చిత్రం ‘సలామ్ వెంకీ’ అందించే సందేశమదేనని చెప్పింది సీనియర్ నటి కాజోల్. డీఎండీ అనే అరుదైన కండరాల వ్యాధితో ప్రాణాలు కోల్పోయిన చెస్ ఆటగాడు కోలవెన్ను వెంకటేష్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2004లో హైదరాబాద్లో మరణించారు కోలవెన్ను వెంకటేష్. ఆయన మృతి అప్పట్లో కారుణ్య మరణంపై నైతిక చర్చకు దారితీసింది.
‘సలామ్ వెంకీ’ చిత్రంలో వ్యాధి బారిన పడి నరకయాతన అనుభవిస్తున్న కుమారుడికి సపర్యలు చేస్తూ అతనిలో ధైర్యాన్ని ప్రోది చేసే తల్లి పాత్రలో కాజోల్ నటించింది. ‘ఈ కథ నా హృదయాన్ని కదిలించింది. చాలా సన్నివేశాల్లో గ్లిజరిన్ అవసరం లేకుండానే ఏడ్చేశాను. జీవితం ఒకటే కాబట్టి ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రతిక్షణాన్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఈ సినిమా ద్వారా అర్థం చేసుకున్నా’ అని కాజోల్ పేర్కొంది. సీనియర్ నటి రేవతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకురానుంది.