కృష్ణ, సుమీత జంటగా దర్శకుడు అంజన్ చెరుకూరి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సాయి విలా సినిమాస్ సంస్థ నిర్మిస్తున్నది. ఈ చిత్ర షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో హైదరాబాద్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో దర్శకులు బి. గోపాల్, రేలంగి నరసింహారావు అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అంజన్ కుమార్ మాట్లాడుతూ..‘త్వరగా డబ్బు సంపాదించి, ఏ లోటూ లేకుండా జీవితాన్ని సాగించాలని చాలా మంది కోరుకుంటారు. కానీ ఆ కలలు కొందరికే సాకారం అవుతాయి.
ఇలా ఆశపడే ఓ మధ్య తరగతి ప్రేమ జంట తమకు అందివచ్చిన ఓ అవకాశాన్ని ఉపయోగించుకుని కోటీశ్వరులు ఎలా అయ్యారు అనేది చిత్ర కథగా చెబుతున్నాం’ అన్నారు. నిర్మాతలు లక్ష్మణ్ రావు, శ్రీనివాస్ మాట్లాడుతూ..‘మా సంస్థలో మొదటి సినిమా రుద్రవీణ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ కథ నచ్చడంతో రెండో చిత్రంగా నిర్మిస్తున్నాం. సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభిస్తాం’ అన్నారు.