Sai Srinivas | టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్లో పెళ్లి సంబరాలు ప్రారంభమయ్యాయి. తన ప్రేయసి కావ్యారెడ్డితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 29న తిరుమలలో వీరి వివాహ వేడుక జరగనుండగా, కుటుంబ సభ్యులు ఇప్పటికే ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి కొడుకు ఫంక్షన్ ని నిర్వహించారు. ఇందులో రాయల్ లుక్లో కనిపించారు. వీరి పెళ్లి ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. కొందరు నెటిజన్స్ అయితే సోషల్ మీడియాలో అప్పుడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా బెల్లంకొండ కుటుంబం పెళ్లి ఆహ్వాన కార్యక్రమాన్ని వేగంగా కొనసాగిస్తోంది. సాయి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులను వ్యక్తిగతంగా కలుసుకుని ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల సాయి శ్రీనివాస్ కుటుంబంతో కలిసి నటుడు నాగార్జున నివాసానికి వెళ్లి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. తిరుమలలో జరగనున్న ఈ శుభకార్యానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని కోరగా, నాగార్జున ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా మర్యాదపూర్వకంగా కలుసుకుని పెళ్లికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కూడా సాయి శ్రీనివాస్కు తన శుభాకాంక్షలు తెలియజేశారు. కొద్ది రోజుల క్రితం మెగాస్టార్ చిరంజీవిని కూడా కలిసి ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే. ఈ ఆహ్వానాల సందర్భంగా తీసిన చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. తిరుమలలో జరగనున్న ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.మొత్తానికి బెల్లంకొండ కుటుంబంలో జరగనున్న ఈ పెళ్లి వేడుక టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది.