Sai Srinivas | టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. తన ప్రేయసి కావ్యారెడ్డితో ఆయన వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 29న తిరుమలలో వీరి వివాహ వేడుక జరగనుండగా, కుటుంబ సభ్యులు ఇప్పటికే శుభకార్యానికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గత కొన్ని రోజులుగా బెల్లంకొండ కుటుంబం పెళ్లి ఆహ్వాన పత్రికలను ప్రముఖులకు అందజేస్తోంది. ఈ క్రమంలో సాయి శ్రీనివాస్ తన కుటుంబ సభ్యులతో కలిసి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులను వ్యక్తిగతంగా కలుసుకుని ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వాన కార్యక్రమం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారింది.
రీసెంట్గా సాయి శ్రీనివాస్ కుటుంబంతో కలిసి నాగార్జున అక్కినేని నివాసానికి వెళ్లి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. తిరుమలలో జరగనున్న ఈ శుభకార్యానికి కుటుంబ సమేతంగా హాజరు కావాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా నాగార్జున సాయి శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కూడా బెల్లంకొండ కుటుంబం మర్యాదపూర్వకంగా కలుసుకుంది. పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేసి, కార్యక్రమానికి రావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం కూడా సాయి శ్రీనివాస్కు తన శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కొద్ది రోజుల క్రితం చిరంజీవిని కూడా కలిసి ఆహ్వానం అందించిన విషయం తెలిసిందే.
ఈ ఆహ్వానాల సందర్భంగా తీసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అభిమానులు సాయి శ్రీనివాస్కు ముందుగానే శుభాకాంక్షలు తెలుపుతూ సందడి చేస్తున్నారు. తిరుమలలో జరిగే ఈ వివాహ వేడుకకు సినీ, రాజకీయ రంగాల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. బెల్లంకొండ కుటుంబంలో జరిగే ఈ పెళ్లి వేడుక టాలీవుడ్లో హాట్ టాపిక్ కానుంది.