దక్షిణాదిలో తిరుగులేని స్టార్డమ్ను సొంతం చేసుకున్న సాయిపల్లవి ‘ఏక్ దిన్’ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నది. అమీర్ఖాన్ కుమారుడు జునైద్ఖాన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సునీల్ పాండే దర్శకుడు. అమీర్ఖాన్ నిర్మాణ భాగస్వామి. మే 1న సినిమా విడుదల కానున్నది. ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సాయిపల్లవి భావోద్వేగభరితంగా మాట్లాడింది. తాను ఇప్పటివరకు ఏం సాధించానో తెలియదని, అయితే వివిధ భాషల్లో గొప్ప ప్రతిభావంతులతో కలిసి పనిచేశాననే సంతృప్తి మాత్రం మిగిలిందని చెప్పింది.
హిందీ ప్రేక్షకులు తనను ఎలా స్వీకరిస్తారోనని కాస్త ఆందోళనగా ఉందని సాయిపల్లవి తెలిపింది. ‘ఈ సినిమా చూసి కన్నీళ్లను ఆపుకోలేకపోయా. చుట్టూ లైట్స్ లేకుండా ఉంటే ఏడుపు ఆగేది కాదు. అమీర్ఖాన్లా అందరి ముందు ఎమోషనల్ అవ్వాలంటే చాలా ధైర్యం కావాలి. నేను మాత్రం భావోద్వేగాలను చాలా వరకు కంట్రోల్ చేసుకున్నా. ‘ఏక్ దిన్’ హృద్యమైన ప్రేమకథ. బాలీవుడ్లో నాకు శుభారంభాన్నిస్తుందనే నమ్మకం ఉంది’ అని చెప్పింది. ఈ సినిమా ‘ఒక రోజు’ టైటిల్తో తెలుగులో విడుదలకానుంది.