నటనకు ఆస్కారమున్న క్యారెక్టర్స్ చేయించాలంటే దర్శకుల మొదటి ఎంపిక సాయి పల్లవి. ఆమె ప్రతిభపై వారికంత నమ్మకం. అనేక చిత్రాలు ఈ నాయిక నట ప్రతిభను చూపించాయి. రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్లకు భిన్నంగా తన కెరీర్ను మలుచుకున్న సాయి పల్లవి..ప్రేక్షకుల ఆదరణతో పాటు విమర్శకుల మెప్పునూ పొందింది. ఈ క్రమంలోనే ఆమెకు స్టార్ హోదా, పలు అవార్డులు దక్కాయి.
తాజాగా రెండు ఫిలింఫేర్ పురస్కారాలు అందుకుంది సాయి పల్లవి. ‘లవ్ స్టోరి’ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డ్ దక్కించుకున్న సాయి పల్లవి ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో నటనకు విమర్శకులు మెచ్చిన ఉత్తమ నటిగా పురస్కారం గెల్చుకుంది. ఒకే వేదికపై రెండు పురస్కారాలు అందుకోవడంపై ఈ తార ఆనందాన్ని వ్యక్తం చేసింది. సాయి పల్లవి స్పందిస్తూ…‘రెండు సినిమాలకు ఒకే ఏడాది పురస్కారాలు దక్కడం అరుదైన విషయం. ఈ సందర్భం నాకెంతో ప్రత్యేకం. ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావు. ‘లవ్ స్టోరి’, ‘శ్యామ్ సింగరాయ్’ చిత్రాల్లో గొప్ప పాత్రల్లో నటించే అవకాశం దక్కింది. ఈ తరహా క్యారెక్టర్స్లో నటించాలని కోరుకుంటున్నా’ అని అంది.