నాలుగో సింహం పేరుతో ‘పోలీస్ స్టోరీ 3’ సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు నటుడు సాయికుమార్ తెలిపారు. ఆయన కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన ఈ సినిమాకు మూడో భాగాన్ని తెరకెక్కిస్తామని వెల్లడించారు. సాయికుమార్ కీలక పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గంధర్వ’. ఈ సినిమాలో సందీప్ మాధవ్ హీరోగా నటించారు. అప్సర్ దర్శకుడు. ఈ నెల 8న సినిమా విడుదలవుతున్నది. ఈ సందర్భంగా చిత్ర విశేషాలను తాజా ముఖాముఖిలో తెలిపారు సాయికుమార్.
ఈ అక్టోబర్కు నటుడిగా నాకు 50 ఏళ్లు నిండుతాయి. 1972లో నా 11 ఏట దుర్యోధనుడి పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశాను. ఇప్పుడు ఒక సినిమాలో కాకతాళీయంగా అదే పాత్రలో నటిస్తున్నాను. ఈ 50 ఏళ్ల ప్రస్థానం సందర్భంగా ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలని ఉంది. ‘పోలీస్ స్టోరీ’ సినిమాతో నాకొచ్చిన గుర్తింపు మీకు తెలుసు. ఆ ఇమేజ్ నుంచి బయటకు రావడానికి నాకు చాలా సమయం పట్టింది.
కొత్త తరహా చిత్రమిది. సైన్స్ ఫిక్షన్ కథతో దర్శకుడు అప్సర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నేను రాజకీయ నాయకుడి పాత్రలో నటించాను. సినిమాలోని 1971 నుంచి 2021 అనే టైమ్ ట్రావెల్ అంశం ఆకట్టుకుంటుంది.
కమల్ హాసన్ ‘విక్రమ్’ సాధించిన విజయం చూస్తుంటే మళ్లీ క్రైమ్ స్టోరీస్ చేయాలనిపిస్తున్నది. ‘పోలీస్ స్టోరీ’ సినిమాకు మూడో భాగం తెరకెక్కించే సన్నాహాల్లో ఉన్నాం. ప్రస్తుతం ధనుష్ ‘సార్’ చిత్రంతో పాటు డీజిల్ అనే మరో చిత్రంలో నటిస్తున్నా. ఈ చిత్రంలో మాఫియా లీడర్గా మూడు గెటప్లలో కనిపిస్తా.