సాయికృష్ణ దమ్మాలపాటి హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘పదహారు రోజుల పండగ’. సాయికిరణ్ అడివి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రదా పిక్చర్స్, సాయిసినీ చిత్ర సంస్థలు నిర్మిస్తున్నాయి. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల క్లాప్నివ్వగా, నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కెమెరా స్విఛాన్ చేశారు. సీనియర్ దర్శకుడు కృష్ణవంశీ ఈ టైటిల్ను సూచించారని, ఆయనకు కథ బాగా నచ్చిందని, చక్కటి కుటుంబ కథా చిత్రంగా అలరిస్తుందని చిత్ర దర్శకుడు సాయికిరణ్ అడివి తెలిపారు.
ఈ చిత్రంలో తాను అత్తమ్మ పాత్రను పోషిస్తున్నానని రేణు దేశాయ్ పేర్కొన్నారు. వినూత్నమైన కథతో హీరోగా కెరీర్ను ఆరంభించడం ఆనందంగా ఉందని సాయికృష్ణ అన్నారు. గోపికా ఉదయన్, రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, అశోక్కుమార్, అనీష్ కురువిల్లా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.కల్యాణి సునీల్, సంగీతం: అనూప్ రూబెన్స్, ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ-మోనికా నిగోట్రే, మాటలు: సోమశేఖర్ పొక్కళ్ల, నిర్మాతలు: సురేష్కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి, కథ, దర్శకత్వం: సాయికిరణ్ అడివి.