Aishwarya Rai | బాలీవుడ్ అగ్ర తారలు ఐశ్వర్యరాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్లు చేసిన న్యాయపోరాటానికి యూట్యూబ్ ఎట్టకేలకు దిగొచ్చింది. తమ అనుమతి లేకుండా AI డీప్ఫేక్ టెక్నాలజీ ద్వారా తమ ఫొటోలను, వీడియోలను యూట్యూబ్లో ప్రసారం చేస్తున్నారని వాటిని తొలగించాలని కోరుతూ ఈ జంట మొదట ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చినప్పటికీ యూట్యూబ్ ఆ వీడియోలను తొలగించలేదు. దీంతో ఈ విషయంపై ఐశ్వర్య దంపతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై మరో అడుగు ముందుకేసి, యూట్యూబ్, దాని మాతృ సంస్థ గూగుల్పై ఏకంగా రూ. 4 కోట్లకు భారీ పరువు నష్టం దావా వేశారు. ఈ దావా వేయడంతో యూట్యూబ్ సంస్థ వెంటనే స్పందించింది. దాదాపు 250కి పైగా వీడియో లింక్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించడమే కాకుండా, అటువంటి కంటెంట్ను ప్రసారం చేస్తున్న ఛానల్స్ను బ్లాక్ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ పెరుగుతున్న ఈ తరుణంలో సినీ సెలబ్రిటీలకు ఇలాంటి వ్యక్తిత్వ హక్కుల (Personality Rights) సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. ఈ వివాదంలో, ఐశ్వర్యరాయ్ గౌరవం ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఉన్న యూఆర్ఎల్లను వెంటనే తొలగించి బ్లాక్ చేయాలని ఢిల్లీ హైకోర్టు గూగుల్, యూట్యూబ్ సహా అన్ని ప్లాట్ఫార్మ్లకు నోటీసులు జారీ చేసింది. 72 గంటల్లోపు ఆ కంటెంట్ కనిపించకుండా చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం కఠినంగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే యూట్యూబ్, గూగుల్ వేగంగా చర్యలు చేపట్టాయి. ఇటీవలే టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జున కూడా తన పేరు, ఫోటోలు, వీడియోలను అనుమతి లేకుండా వాణిజ్య ప్రకటనలకు ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేసి, తన హక్కులను కాపాడుకోవడానికి కోర్టు ఉత్తర్వులు పొందిన విషయం కూడా తెలిసిందే. సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల పరిరక్షణ విషయంలో ఈ కేసులు ఒక కీలకమైన చర్చకు తెరలేపాయి.