Rishab Shetty Kantara Prequel | రిషబ్ షెట్టి (Rishab Shetty) నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘కాంతార'(Kantara) చిత్రం చిక్కుల్లో పడింది. ఈ సినిమాకు ప్రీక్వెల్ వస్తున్న విషయం తెలిసిందే. కాంతారకు ముందు ఏం జరిగిందనే కథాశంతో ఈ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. కర్ణాటకలోని అటవీ ప్రాంతాల్లో ఈ సినిమాను షూట్ చేస్తున్నారు.
అయితే అడవిలో షూటింగ్ చేయడం వలన అటవీ ప్రాంతం నాశనం అవుతుందని స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ మూవీ షూటింగ్కి గ్రామ శివార్లలోని ఖాళీ మైదానాల్లో ప్రభుత్వం అనుమతినివ్వగా.. చిత్రబృందం మాత్రం అక్రమంగా అడవిలోకి వెళ్లి షూట్ చేస్తుందని తెలిపారు. అంతేగాకుండా.. ఈ సినిమా షూటింగ్ కోసం పేలుడు పదార్థాలు ఉపయోగిస్తున్నారని దీనివలన అడవిలో ఉన్న పక్షులతో పాటు మూగజీవాలు భయాందోళనకి గురవతున్నట్లు గ్రామస్థులు చెబుతున్నారు. అలాగే ఈ షూటింగ్ వలన పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. అయితే ఈ విషయంలోనే గ్రామస్థులకు చిత్రబృందంకి గొడవ జరిగింది. గ్రామానికి చెందిన ఓ యువకుడిపై చిత్ర బృందం దాడి చేసిందని తెలిపారు. దీంతో స్థానిక గ్రామస్థులంతా యెసలూరు పోలీస్ స్టేషన్ (Police station)లో కాంతార చిత్రబృందంపై కేసు నమోదు చేశారు.
చిన్న సినిమాగా వచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న చిత్రం ‘కాంతార’ (Kantara). 2022లో విడుదలైన ఈ చిత్రం దాదాపు రూ.400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఇప్పుడు ఇదే సినిమాకు ప్రీక్వెల్ (Prequel) రాబోతుంది.