దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న ‘కాంతార’ చిత్రానికి రెండోభాగాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నామని కొద్ది రోజుల క్రితం చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించిన విషయం తెలిసింది. ‘కాంతార’ చిత్రానికిది ప్రీక్వెల్ అని నిర్మాత విజయ్ కిరంగదూర్ తెలియజేశారు. తాజాగా ఈ విషయాన్ని ధృవీకరించారు చిత్ర హీరో, దర్శకుడు రిషబ్శెట్టి. ‘కాంతార’ చిత్ర వందరోజుల వేడుకను ఇటీవల బెంగళూరులో నిర్వహించారు. రిషబ్శెట్టి మాట్లాడుతూ ‘వాస్తవానికి ‘కాంతార’ చిత్రం ద్వారా మీరు చూసింది సినిమాకు సంబంధించిన రెండో భాగం అనుకోవాలి.
ఈ కథ ముందు ఏం జరిగిందనే విషయాల్ని ప్రీక్వెల్లో ఆవిష్కరిస్తాం. ప్రస్తుతం ప్రీక్వెల్ గురించి పరిశోధన చేస్తున్నా. వచ్చే ఏడాది ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’ అన్నారు. ‘కాంతార’ చిత్రాన్ని 16కోట్లతో తెరకెక్కించగా..ప్రీక్వెల్ను భారీ హంగులతో దాదాపు 100కోట్ల బడ్జెట్తో రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. దక్షిణ కన్నడ ప్రజల సంస్కృతిలో భాగమైన భూతకోలా దైవారాధన, అడవి బిడ్డల అస్తిత్వ పోరాటం నేపథ్యంలో డివోషనల్ థ్రిల్లర్గా ‘కాంతార’ చిత్రాన్ని తీశారు.