ముంబై: బాలీవుడ్ నటి రియా చక్రవర్తి బ్యాంక్ ఖాతాలు డీఫ్రీజ్ అయ్యాయి. ఆమె గాడ్జెట్లు తిరిగి దక్కాయి. గత ఏడాది జూన్ 14న ముంబైలోని తన ఇంట్లో అనుమానాస్పదంగా మరణించిన నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ కేసుపై సీబీఐతోపాటు ఎన్సీబీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తన కుమారుడి మరణానికి ప్రియురాలు రియా చక్రవర్తి, ఆమె కుటుంబం కారణమని సుశాంత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు చేశారు. సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి ఆమె ఖాతాకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని ఆరోపించారు.
కాగా, సుశాంత్ కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్సీబీ గత ఏడాది సెప్టెంబర్లో నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసింది. ఆమె గాడ్జెట్లను స్వాధీనం చేసుకోవడంతోపాటు బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసింది. సుమారు నెల రోజులు జైలులో ఉన్న రియాకు బాంబే హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆమె విడుదల అయ్యారు.
అనంతరం తన బ్యాంక్ ఖాతాలను డీఫ్రీజ్ చేయాలని కోరుతూ ఎన్సీబీ ప్రత్యేక కోర్టులో రియా అప్లికేషన్ దాఖలు చేశారు. ఎలాంటి కారణం లేకుండా ఎన్సీబీ వాటిని స్తంభింపజేసిందని ఆమె ఆరోపించారు. ఈ చర్య అన్యాయమని, పక్షపాతాన్ని కలిగించిందని పేర్కొన్నారు. తాను పన్నులు చెల్లించడానికి, తన జీవనశైలికి, తన తమ్ముడిని చూసుకోవడానికి తనకు బ్యాంక్ ఖాతా అవసరమని పిటిషన్ ద్వారా కోర్టును అభ్యర్థించారు.
మరోవైపు ఈ కేసు తేలేందుకు చాలా కాలం పడుతుందని, అప్పటి వరకు రియా బ్యాంకు ఖాతాను స్తంభించడం అనవసరమని ఆమె తరుఫు న్యాయవాది కోర్టులో వాదించారు. అయితే ఈ కేసులో ఆర్థిక దర్యాప్తు కొనసాగుతున్నదని ఎన్సీబీ తరపున వాదించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అతుల్ సర్పాండే కోర్టుకు తెలిపారు. ఖాతాలను స్తంభింపజేయకపోతే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని అన్నారు.
కాగా, ఈ అంశంపై నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలేస్తున్నట్లు కేసు దర్యాప్తు అధికారి చెప్పారు. దీంతో దరఖాస్తుదారుడి బ్యాంక్ ఖాతా, ఫిక్స్డ్ డిపాజిట్లు స్తంభింపజేయడానికి ప్రతివాది వైపు నుండి బలమైన అభ్యంతరం లేదని తెలుస్తోందని కోర్టు అభిప్రాయపడింది. అటువంటి పరిస్థితులలో షరతులకు లోబడి బ్యాంక్ ఖాతా, ఎఫ్డీలను అన్ఫ్రీజ్ చేయడానికి ఆమెకు అర్హత ఉందని తెలిపింది.
కేసు విచారణ పెండింగ్లో ఉన్నందున ముగింపు సమయంలో అవసరమైన ఆర్డర్ల కోసం 2020 సెప్టెంబర్ 16న చూపిన విధంగా మిగిలిన మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో అందుబాటులో ఉంచాలని రియాకు కోర్టు సూచించింది. ఈ మేరకు అఫిడవిట్ ద్వారా హామీ ఇవ్వాలని పేర్కొంది.
మరోవైపు రియా నుంచి స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపిన మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ను ప్రయోగశాల తిరిగి ఇచ్చిందని, వాటిని సేకరించవచ్చని ఈ కేసులో దర్యాప్తు అధికారి ఆమెకు తెలియజేసినట్లు న్యాయవాది సర్పాండే కోర్టుకు తెలిపారు.
దీంతో తగిన ధృవీకరణ, రూ.లక్ష బాండ్ తీసుకున్న తర్వాత ఆ ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను రియాకు తిరిగి ఇవ్వాలని కోర్టు విడిగా ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏడాది తర్వాత ఆమె బ్యాంకు ఖాతాలు డీఫ్రీజ్ కాగా, స్వాధీనం చేసుకున్న గాడ్జెట్లు కూడా తిరిగి వచ్చాయి.